2024 లోక్సభ ఎన్నికలకై వ్యూహ రచన!
ముంబై, జూన్ 11: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎన్సీపీ అధినేత శరద్పవార్తో భేటీ అయ్యారు. ముంబైలోని పవార్ నివాసంలో దాదాపు మూడు గంటలపాటు ఈ సమావేశం జరిగింది. అయితే భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడలేదు. తాజా రాజకీయ పరిస్థితులపై వారు చర్చించినట్టు ఎన్సీపీ వర్గాలు తెలిపాయి. ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో తన వ్యూహాలతో మమత, స్టాలిన్లకు ప్రశాంత్ కిషోర్ ఘన విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఇరువురికి మద్దతు తెలిపిన నేతలను ప్రశాంత్ కిషోర్ స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని, అందులో భాగంగానే పవార్ను కలిసినట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే మిషన్ 2024 లక్ష్యంగానే ఈ భేటీ జరిగినట్టు జోరుగా ప్రచారం సాగుతున్నది. ప్రధాని మోదీని ఢీకొట్టేందుకు ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేసే అంశంపై చర్చ సాగినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఎన్నికల వ్యూహరచన నుంచి తాను తప్పుకుంటానని ఇటీవల ప్రశాంత్ కిషోర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే రాజకీయ నేతగా తాను విఫలమయ్యానని, భవిష్యత్లో ఏంచేయాలన్నదానిపై ఇంకా ఆలోచించాల్సి ఉన్నదని పేర్కొన్నారు. అయితే ఆయన మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకం కానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.