హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సోమవారం కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల స్థానంలో హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మార్పు చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యంతరాలపై, వినతులకు నెల రోజుల గడువు ఇచ్చింది. ఈ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దయాకర్రావు కృతజ్ఞతలు తెలిపారు. గత నెల 21న వరంగల్ నగర పర్యటన సందర్భంగా ప్రజాప్రతినిధులు, ప్రజల వినతి మేరకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని మంత్రి పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు. దీంతో పరిపాలన ప్రజలకు మరింత సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. ఇచ్చిన మాట మేరకు వెంటనే ఆదేశాలు జారీ చేయడం సంతోషకరమన్నారు.