భోపాల్ : మధ్యప్రదేశ్ లోని అగర్ మల్వా జిల్లాలో దారుణ దృశ్యాలు కంటపడుతున్నాయి. పంట పొలాల్లోని చెట్ల కింద కొవిడ్ రోగులకు చికిత్స అందిస్తుండగా చెట్టు కొమ్మలను ఐవీ ఫ్లూయిడ్ బాటిల్స్ కు స్టాండ్లుగా వాడుతున్న పరిస్థితి చూపరులను కలిచివేస్తోంది. జిల్లాలో కరోనా వైరస్ కేసులు రికార్డుస్ధాయిలో పెరుగుతుండటంతో దవాఖానాలపై విపరీతమైన ఒత్తిడి నెలకొంది. దీంతో దవాఖానల్లో పడకలు లేని పరిస్థితిలో ఎక్కడ అనువుగా ఉంటే రోగులకు అక్కడే వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఇక జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వారు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు వ్యయ ప్రయాసలకు లోనవుతుండటంతో పంట పొలాల్లోనే స్ధానిక వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. వైద్య నియమాలకు విరుద్ధంగా చెట్ల కింద రోగులను పడుకోబెట్టి చెట్ల కొమ్మలకే గ్లూకోజ్ బాటిల్స్ ను వేలాడదీశారు. దీంతో పంట పొలాలు దవాఖాన బెడ్లుగా, చెట్లు గ్లూకోజ్ బాటిల్ స్టాండ్స్ గా మారిన పరిస్థితి కనిపిస్తోంది.