హైదరాబాద్ : రాష్ర్టంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. నిరుపేద విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించడం మంచిదే.. కానీ టీచర్లకు సరైన తర్ఫీదు ఇవ్వాలన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రతి పాఠశాలకు ఇంగ్లీష్ టీచర్ను నియమించాలి. వచ్చే జూన్లోపు అయినా డీఎస్సీ నిర్వహించి.. టీచర్ల రిక్రూట్మెంట్ చేపట్టాలన్నారు.
హైస్కూల్స్లో శానిటేషన్ కింది సిబ్బందిని నియమించాలన్నారు. స్కూళ్లలో డొమెస్టిక్ కింద విద్యుత్ బిల్లులు ఇవ్వాలన్నారు. ఆర్ట్, క్రాఫ్ట్ ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలన్నారు. మధ్యాహ్న భోజన సిబ్బందికి సకాలంలో జీతాలు అందేలా చూడాలన్నారు. తన నియోజకవర్గంలోని వేంసూరు మండలంలోని 8 జడ్పీ పాఠశాలల్లో 100 శాతం రిజల్ట్ వచ్చిందన్నారు. సత్తుపల్లిలో జూనియర్ కాలేజీని ఏర్పాటు చేయాలన్నారు. ప్రయివేటు పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లను మానవీయ కోణంలో ఆదుకోవాలన్నారు. ఎంఈవో పోస్టులను భర్తీ చేసి.. స్కూళ్ల నిర్వహణపై దృష్టి సారించేలా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మండల కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోరారు.