బెంగళూర్ : పో్లీసుల కండ్లుకప్పి సైబర్ నేరగాళ్లు చెలరేగుతూనే ఉన్నారు. బెంగళూర్లోని వైట్ఫీల్డ్ ప్రాంతంలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో సైబర్ నేరగాళ్లు ఇద్దరు మహిళలను రూ 13 లక్షల వరకూ మోసగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సోషల్ మీడియాలో మహిళలను పరిచయం చేసుకున్న మోసగాళ్లు వారిని నిండా ముంచారు. వైట్ఫీల్డ్ ప్రాంతానికి చెందిన 30 ఏండ్ల మహిళ ఇటీవల ఓ మ్యాట్రిమోనియల్ సైట్లో తన ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నారు.
సిద్ధార్ధ ప్రకాష్ అనే నిందితుడు మహిళను పెండ్లి చేసుకునేందుకు ఆసక్తి కనబరిచాడు. ఇద్దరి మధ్య స్నేహం పెరగ్గా తనకు రూ 7.7 లక్షలు అవసరమని నిందితుడు మహిళను కోరాడు. అతడి ఉద్దేశాన్ని పసిగట్టని మహిళ నిందితుడి ఖాతాకు రూ 7.7 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు. నగదు ఖాతాలో పడగానే సోషల్ మీడియా నుంచి నిందితుడు మాయమయ్యాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా సైబర్ క్రైమ్ విభాగం దర్యాప్తు చేపట్టింది.
ఇక అదే ప్రాంతానికి చెందిన మరో మహిళను సోషల్ మీడియాలో జోర్డాన్ మిలట్గా పరిచయం చేసుకున్న వ్యక్తి తాను ఫ్రాన్స్ ఎయిర్లైన్లో పైలట్గా చేస్తుంటానని నమ్మబలికాడు. ఆపై మహిళ కోసం తాను డైమండ్ రింగ్, రెండు ఐఫోన్లు కొనుగోలు చేయడంతో పాటు 50,000 డాలర్ల నగదు తీసుకురాగా అవి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ డిపార్ట్మెంట్లో చిక్కుకుపోయాయని చెప్పాడు. మిలట్ బృందానికి చెందిన అనిత మహిళకు కస్టమ్స్ అధికారిగా ఫోన్ చేసి తాను చెప్పిన ఖాతాల్లో రూ 5 లక్షలు జమ చేయాలని కోరింది. ఆమె చెప్పినట్టుగానే మహిళ ఆయా ఖాతాల్లో రూ 5 లక్షలు డిపాజిట్ చేసి మోసపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.