గువహటి : కొవిడ్-19 పరీక్షలను తప్పించుకునేందుకు అసోంలోని జాగిరోడ్ రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 500 మంది ప్రయాణీకులు పారిపోయారు. కన్యాకుమారి-దిబ్రూగఢ్ వివేక్ ఎక్స్ప్రెస్ నుంచి దిగిన ప్రయాణీకులను పట్టుకునేందుకు అధికారులు ప్రయత్నించినా ప్రయాణీకులు పరారయ్యారు. జాగిరోడ్ స్టేషన్ నుంచి తప్పించుకున్న ప్రయాణీకుల్లో కొద్ది మందిని అధికారులు వెనక్కితీసుకువచ్చారు. ప్రయాణీకుల్లో మహిళలు, పిల్లలతో పాటు వలస కూలీలు అధికంగా ఉన్నారు.
కన్యాకుమారి నుంచి ఐదు రాష్ట్రాల మీదుగా అయిదు రోజుల పాటు ప్రయాణించిన రైలు అసోంకు చేరుకుంది. రాష్ట్రంలోకి వచ్చే ప్రయాణీకులందరికీ విధిగా కరోనా పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో ప్రయాణీకులు స్టేషన్ కు చేరగానే తమ గమ్యస్థానాలకు పరుగులు తీశారు. పోలీసులు, రైల్వే సిబ్బంది ప్రయాణీకులను నిలువరిస్తున్నా వారు పెద్ద సంఖ్యలో స్టేషన్ వెలుపలికి పరుగలు తీస్తున్నా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిహార్ లోని బక్సర్ లోనూ కొవిడ్ టెస్టింగ్ కు భయపడి గత నెల రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణీకులు పారిపోయిన ఘటన వెలుగుచూసింది.