దేవరకద్ర నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యం
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి
దేవరకద్ర రూరల్, ఏప్రిల్ 8 : ప్రతి ఎకరాకూ సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి చెప్పారు. చిన్నచింతకుంట మండలం ఏదులాపూర్ గ్రామశివారులోని ఊకచెట్టువాగు లో గురువారం రూ.8కోట్ల 36లక్షలతో చెక్డ్యాం నిర్మాణానికి జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఊకచెట్టువాగులో రూ.42కోట్లతో 9 చెక్డ్యాంలు నిర్మించినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రారంభించిన చెక్డ్యాం నిర్మాణ పనులను నాలుగు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకూ సాగునీరు అందించి సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆ ర్ కృషితో ప్రతి చెరువూ నీటితో నిండటంతో సమృద్ధిగా పం టలు పండుతున్నాయన్నారు. రైతును రాజు చేయడమే ప్రభుత్వ ధ్యేమమని తెలిపారు. ఈ సంవత్సరం యాసంగిలో రెండవ పంట 65వేల ఎకరాల్లో సాగైందని చెప్పారు. దేశం లో పండించిన ధాన్యంలో మన తెలంగాణ నుంచి ధాన్యం సగానికిపైగా ఉందని ఎమ్మెల్యే ఆల వివరించారు.
ఆలయాల అభివృద్ధికి పెద్దపీట
రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తిస్వామి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవానికి జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, ఎమ్మెల్యే ఆల ముఖ్యఅథితులుగా హాజరయ్యారు. ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉమ్మడి జిల్లా దేవాదాయ సహాయ కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరాజు పాలకమండలి చైర్మన్గా ప్రతాప్రెడ్డి, ప్రధాన అర్చకులతోపాటు 13మంది ధర్మకర్తలతో ప్రమాణం చేయించారు. అనంతరం ఆలయానికి వెనుకభాగం నుంచి గుట్టపైకి దారి ఏర్పాటు చేసిన దాతలను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీలు రాజేశ్వరి, అన్నపూర్ణ, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్లు ఉమామహేశ్వర్రెడ్డి, సురేందర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోట రాము, ఆలయ ఈవో శ్రీనివాసులు పాల్గొన్నారు.