ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మేయర్ గద్వాల విజయలక్ష్మీ అన్నారు. వార్డుల్లోని సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని చెప్పారు. పార్టీలకు అతీతంగా అన్ని వార్డులలో తాను పర్యటిస్తానని ఆమె పేర్కొన్నారు. సోమవారం ‘మేయర్’ మీడియాతో చిట్చాట్లో పలు అంశాలను ప్రస్తావించారు. బీజేపీతో సహా అన్ని పార్టీల కార్పొరేటర్లు తమ ప్రాంతాలకు రావాల్సిందిగా కోరుతున్నారని, మల్కాజిగిరి సర్కిల్లోని బీజేపీ కార్పొరేటర్ ఒకరు తమ వార్డుకు రావాల్సిందిగా కోరారని మేయర్ వివరించారు. కొత్తగా కార్పొరేటర్లుగా ఎన్నికైన వారు ఆయా అంశాల గురించి తనను సంప్రదిస్తున్నారని పేర్కొన్నారు.
జనరల్ బాడీ సమావేశంపై కార్పొరేటర్లతో చర్చిస్తున్నానని, ఈ సమావేశం జరిగితే సభ్యుల నుంచి పనుల కోసం డిమాండ్లు వస్తాయన్నారు. డిమాండ్లన్నింటినీ చేపట్టాలంటే నిధులు కావాలని, ప్రస్తుతం, జీహెచ్ఎంసీ ఖజానా పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని మేయర్ అన్నారు. ప్రతి నెలా జీతాల చెల్లింపులకే ప్రయాసపడాల్సి వస్తోందని, ఐతే ఇందులో కొన్నింటినైనా ఆమోదించాల్సి ఉంటుందన్నారు. పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యతనివ్వనున్నట్లు ఈ సందర్భంగా మేయర్ తెలిపారు.