హన్మకొండ, ఏప్రిల్ 17 : బీజేపీ నాయకులు పిచ్చికూతలు, అబద్దపు మాటలు మానుకోవాలని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హితవుపలికారు. శనివారం హన్మకొండలో ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్తో కలిసి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటయ్యాక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో వరంగల్ నగరం ఊహించని రీతిలో అభివృద్ధి జరిగిందని చెప్పారు. 40 ఏండ్ల తన రాజకీయ జీవితంలో ఏ ప్రభుత్వమూ చేయనివిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నదని ఉద్ఘాటించారు. కార్పొరేషన్ ఎన్నికలో వార్ వన్సైడ్లాగే టీఆర్ఎస్ పక్షాన ఉంటుందని స్పష్టంచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని, ప్రతీ ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తున్నప్పటికి ఆయనకు బుద్ధి రావట్లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు సీట్లు గెలుస్తామన్న బీజేపీని వరంగల్ ప్రజలు నాలుగో స్థానానికి పరిమితం చేశారని గుర్తుచేశారు. బీజేపీపాలిత రాష్ర్టాలకు పెద్ద మొత్తంలో వరద నిధులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. వరంగల్లో వరదలు వచ్చినపుడు ఎందుకు నిధులు ఇవ్వలేదని ప్రశ్నించారు. మెడికల్ కళాశాలలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినప్పటికీ ఒక్కటి కూడా మంజూరు చేయలేదని.. కనీసం కరీంనగర్, నిజామాబాద్ ఎంపీలు కూడా వారి నియోజకవర్గాలకు మెడికల్ కళాశాలలు తెచ్చుకోని దద్దమ్మలని విమర్శించారు. విభజన చట్టంలో పొందుపరిచిన కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ హామీలు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అందుకే హైదరాబాద్ ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చావు దెబ్బకొట్టారన్నారు. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ అనేది వరంగల్ ప్రజల చిరకాల వాంఛ అని.. కేంద్రం మెడలు వంచైనా కోచ్ ఫ్యాక్టరీ తేవడం ఖాయమన్నారు. గడిచిన ఆరున్నర సంవత్సరాల్లో కేంద్రానికి రూ.2లక్షల 53వేల కోట్లు ఇస్తే.. కేంద్రం రాష్ర్టానికి కేవలం లక్షా 43 వేల కోట్లు మాత్రమే ఇచ్చిందని చెప్పారు. అనంతరం వినోద్కుమార్ మాట్లాడుతూ.. వరంగల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలు పోటీచేసే ముందు వాళ్ల హామీలేమిటో స్పష్టంగా చెప్పాలన్నారు. బీజేపీ నాయకులు రాజ్యాంగంపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ..రాజ్యాంగం ప్రకారం తమకు రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 70 ఏండ్ల అభివృద్ధే దేశ పురోగతి అని.. బీజేపీ చేసిందేమీ లేదని చెప్పారు. వరంగల్కు వచ్చిన వారసత్వ నగరాన్ని అప్పుడు వైఎస్ తిరుపతికి తీసుకెళ్లాడని గుర్తుచేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఈ ప్రాంతం హక్కని. అస్సలే రాదు అనడానికి మీరు ఎవ్వరని వినోద్కుమార్ మండిపడ్డారు. అన్ని కోచ్ ఫ్యాక్టరీలు ఉత్తర భారతదేశంలోనే ఎందుకు ఉండాలి, దక్షిణ భారతదేశంలో తెలంగాణలో ఎందుకు ఉండొద్దని ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో కోచ్ ఫ్యాక్టరీ సాధిస్తామని.. అవసరమైతే మరో పోరాటానికి సిద్ధమవుతామని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీ డాక్టర్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ ఇన్చార్జి గ్యాదరి బాలమల్లు, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.