జమ్మికుంట, జూలై 6 : ఉద్యమకారుడినని చెప్పుకొని పదవులన్నీ అనుభవించి, హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టిన నయవంచకుడు ఈటల రాజేందర్ అని యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ జనరల్ సెక్రెటరీ కే వంశీయాదవ్ మండిపడ్డారు. ఈటల అక్రమాలపై పోరాటాలు చేసినప్పటికీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల నుంచి ఎలాంటి మద్దతు లభించడం లేదని నిరసిస్తూ.. ఐదు మండలాలకు చెందిన 150 మంది యూత్ కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల మైదానం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. ఈటలను ఓడిస్తామని అంబేద్కర్ విగ్రహ సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం వంశీయాదవ్ మాట్లాడుతూ.. ఈటల అక్రమాలపై పోరాటాలు చేస్తున్నామని, నియోజకవర్గ కాంగ్రెస్ నుంచి ఏ నాయకుడు తమకు అండగా నిలవట్లేదని తెలిపారు. ఈటల అవినీతి, అక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. త్వరలో భవిష్యత్ కార్యచరణ తెలియజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రశాంత్యాదవ్, నాగిరెడ్డి, మధుసూదన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శశికుమార్, రాకేశ్, సాయికృష్ణ, సతీశ్, శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.