జైపూర్: పాకిస్థాన్ నుంచి భారత్కు వలస వచ్చిన హిందూ శరణార్థులు కరోనాకు చికిత్స పొందలేక చనిపోతున్నారు. భారత పౌరసత్వం లభించకపోవడంతో వారిని ఆసుపత్రిలో చేర్చుకోవడం లేదు. దీంతో మహమ్మారి బారిన పడి మరణిస్తున్నారు. రాజస్థాన్ సరిహద్దులోని ఎనిమిది గ్రామాల్లో పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన సుమారు 2,500 హిందూ కుటుంబాలు చాలా కాలంగా నివాసం ఉంటున్నాయి. కరోనా సంక్షోభ సమయంలో వారు నానా కష్టాలు పడుతున్నారు. భారత పౌరసత్వం పొందకపోవడంతో వారిని విదేశీ శరణార్థులుగానే పరిగణిస్తున్నారు. దీంతో కరోనా పరీక్షలు, వైద్య చికిత్స, వ్యాక్సినేషన్, ఉచిత రేషన్, బీమా వంటివి పొందలేకపోతున్నారు.
మార్చి 20 నుంచి ఒక్క జోధ్పూర్లోనే ఏడుగురు పాక్ హిందూ శరణార్థులు చనిపోయారు. 2007లో పాక్లోని సింధ్ నుంచి భార్య, పిల్లలతో వచ్చిన బేసర్ మాల్ ఈ నెల 2న కరోనాతో మరణించాడు. మరో హిందూ శరణార్థికి కరోనా సోకగా జోధ్పూర్లోని రెండు ప్రైవేట్ ఆసుపత్రులు చేర్చుకునేందుకు నిరాకరించాయి. దీంతో కరోనాతో చనిపోయాడు. ఇప్పటికైనా తమను ప్రభుత్వం ఆదుకోవాలని పాక్ హిందూ శరణార్థులు కోరుతున్నారు. మరోవైపు కొందరు బీజేపీ నేతలు వీరి కష్టాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.