వరంగల్ అర్బన్ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులంతా బ్రహ్మాండమైన మెజార్టీతో గెలువబోతున్నారని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ధీమా వ్యక్తం చేశారు. కల్లబొల్లి కబుర్లతో ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా రాకుండా వివక్ష చూపుతున్న బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వరంగల్లో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రేపటి తీర్పు మన కండ్ల ముందు ఇప్పుడే కనిపిస్తుందన్నారు. రాజకీయ వాతావరణాన్ని చెడ గొట్టే విధంగా కులాల మధ్య వైషమ్యాలను పెంచి పోషిస్తున్నది. ప్రజలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తుందన్నారు. అందులో భాగమే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, మామునూరు ఎయిర్ పోర్టు గురించి బీజేపీ వాళ్లు చెప్పే అబద్ధపు మాటలే ఇందుకు నిదర్శమన్నారు.
రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు అన్ని విధాల సహకరిస్తున్నా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని ఆరోపించారు. తెలంగాణలో అడిగినంత భూమి, కావాల్సిన వసతులు కల్పించినా కేంద్రం ఈ యూనివర్సిటీలో తరగతులు ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు వేస్తూ తప్పించుకుంటున్నదని మండిపడ్డారు.
ఈ ఎన్నికల్లో వారికి సరైన బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం నాయకత్వాన్ని బలపరిచి టీఆర్ఎస్ అభ్యర్థులందరిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
సమావేశంలో రాజ్యసభ సభ్యుడులు బండ ప్రకాష్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, జిల్లా, నియోజకవర్గ, స్థానిక టీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
దేశంలో 60 శాతం వరిసాగు తెలంగాణలోనే..
వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలి
యాదాద్రిలో స్వాతినక్షత్ర పూజలు
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
భారత్ మమ్మల్ని వ్యాక్సిన్లు అడగలేదు: అమెరికా