లక్నో : ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదరవుతుండటంతో యూపీ ప్రభుత్వం ఆక్సిజన్ కొనుగోలు, సిలిండర్ల రీఫిల్లింగ్ కు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ను తప్పనిసరి చేసింది. ఇండ్లలో ఆక్సిజన్ సిలిండర్లను నిల్వ చేస్తున్నారని దీన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఆదనపు ముఖ్య కార్యదర్శి నవనీత్ సెహగల్ పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితి ఎదురవుతుందనే ఆందోళనతో ఇండ్లలో ఆక్సిజన్ నిల్వ పెట్టుకుంటే పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా ఆక్సిజన్ సరఫరా చేయలేని పరిస్థితి ఎదురవుతుందని అన్నారు.
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇక ఆక్సిజన్ విక్రయిస్తారని చెప్పారు. బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా ఆక్సిజన్ ఫిల్లింగ్ కేంద్రాల వద్ద అధికారులను నియమించామని చెప్పారు. మరోవైపు ఫిల్లింగ్ కేంద్రాల వద్ద పోలీసులను ఉంచాలని కూడా సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆదేశించారని సెహగల్ తెలిపారు. లిక్విడ్ ఆక్సిజన్ సరఫరాలపై ఆధారపడటం తగ్గించేందుకు 31 దవాఖానాల్లో గాలి ద్వారా ఆక్సిజన్ తయారీ కోసం ఎయిర్ సెపరేటర్ లను నెలకొల్పారని వివరించారు. ఈ ప్లాంట్ రెండు వారాల్లో పనిచేయడం ప్రారంభిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరాలను పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని వెల్లడించారు.