చండీగఢ్ : హర్యానాలో లిక్విడ్ ఆక్సిజన్తో బయల్దేరిన ట్యాంకర్ మార్గమధ్యలో అదృశ్యమైంది. జిల్లా డ్రగ్ కంట్రోలర్ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పానిపట్ ప్లాంట్లో లిక్విడ్ ఆక్సిజన్ నింపుకున్న ట్యాంకర్ బుధవారం సిర్సాకు బయల్దేరింది. గురువారం రాత్రి వరకు ట్యాంకర్ గమ్యస్థానానికి చేరుకోకపోవడంతో అధికారులు ఫిర్యాదు చేసినట్లు పానిపట్లోని మాట్లౌడా స్టేషన్ హౌజ్ ఆఫీసర్ మంజిత్ సింగ్ తెలిపారు.
విషయంపై కేసు నమోదు చేసి ట్యాంకర్ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంతో మెడికల్ ఆక్సిజన్కు భారీగా డిమాండ్ ఏర్పడింది.
ఇటీవల రాష్ట్రంలో ఇదే తరహా ఘటన జరగ్గా ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి.
పానిపట్ నుంచి ఫరీదాబాద్లోని కొవిడ్ దవాఖానకు ఆక్సిజన్ తీసుకెళ్తున్న ట్యాంకర్ ఢిల్లీ భూభాగంలోకి వెళ్లగానే ఆ రాష్ట్ర ప్రభుత్వం లూఠీ చేసిందని ఆయన ఆరోపించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి