జైపూర్ : దేశంలో కరోనా కోరలు చాస్తున్నది. రోజు రోజుకు మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతుండడంతో పరిస్థితి దారుణంగా తయారైంది. పలు రాష్ట్రాలు తీవ్ర ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో ప్రాణవాయువు అందక ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఈ విషాదకర ఘటన రాజస్థాన్లోని కోటాలో చోటు చేసుకుంది. కోటాలోని న్యూ మెడికల్ కళాశాల కొవిడ్ హాస్పిటల్లో ఆక్సిజన్ సరఫరా అకస్మాత్తుగా నిలిచిపోవడంతో ఇద్దరు రోగులు మంగళవారం తెల్లవారున మృతి చెందారు.
దీంతో హాస్పిటల్లో చేరిన రోగుల పరిస్థితి మరింత దిగజారిపోయిందని రోగుల బంధువుల ఆరోపించారు. ఆక్సిజన్ అందక 40 ఏళ్ల మహిళతో పాటు ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో రాజస్థాన్ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. హాస్పిటల్ పరిపాలనపై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం మరణాలపై న్యాయమైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. 450 ఆక్సిజన్ బెడ్ల సామర్థ్యం కలిగిన కొవిడ్ హాస్పిటల్లో 582 మంది రోగులు హాస్పిటల్లో చేరడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.