న్యూఢిల్లీ : దేశంలో కరోనా విజృంభిస్తుండటంతో ఆక్సిజన్ అవసరం అంతకంతకు పెరుగుతున్నది. పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత కారణంగా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.
దీంతో ‘ఆక్సిజన్ ఎక్స్ప్రెస్’ పేరుతో ఆక్సిజన్ ప్లాంట్ల నుంచి రాష్ట్రాలకు రైల్వేశాఖ శరవేగంగా మెడికల్ ఆక్సిజన్ను చేరవేస్తున్నది.
ఆదివారం ఒడిశాలోని అన్గుల్ నుంచి దేశరాజధాని ఢిల్లీలోని కొవిడ్ రోగులకు కోసం 30.86 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్తో ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ బయల్దేరినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు.
కొవిడ్పై పోరాటంలో రైల్వేశాఖ కీలకంగా వ్యవహరిస్తున్నది. వివిధ రాష్ట్రాల్లోని ఆక్సిజన్ ప్లాంట్ల నుంచి మెడికల్ ఆక్సిజన్ను దేశవ్యాప్తంగా రవాణా చేస్తున్నది’ అని ఆయన పేర్కొన్నారు.
ఛత్తీస్ఘడ్ రాష్ట్రం రాయ్ఘడ్లోని జిందాల్ స్టిల్ ప్లాంట్ నుంచి 64.55 టన్నుల మెడికల్ ఆక్సిజన్తో గత నెల 27న తొలి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ ఢిల్లీకి చేరింది.
పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్ ప్లాంట్ నుంచి మరో ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ 120 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్తో దేశ రాజధానికి వచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.