జైపూర్: ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పేలడంతో రాజస్థాన్లోని గంగాపూర్ నగరంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లో కొవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్ కోసం ఈ కాన్సన్ట్రేటర్ వాడుతున్నారు. శనివారం ఉదయం దానిని ఆన్ చేయడానికి వెళ్లగా అది పేలింది. అప్పటికే అందులో నుంచి ఆక్సిజన్ లీక్ కావడంతో స్విచ్ ఆన్ చేయగానే మంటలు చెలరేగాయి. ఐఏఎస్ ఆఫీసర్ హర్ సహాయ్ మీనా సోదరుడు సుల్తాన్ సింగ్ ఇంట్లో ఈ ఘటన జరిగింది. సుల్తాన్ సింగ్ రెండు నెలలుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఆయనకు ఈ కాన్సన్ట్రేటర్ను అరేంజ్ చేశారు.
ఆయన భార్య సంతోష్ మీనా ఈ ప్రమాదంలో మృతి చెందింది. కాన్సన్ట్రేటర్ పేలడంతో రూమంతా మంటలు వ్యాపించాయి. ఈ పేలుడు విన్న పొరిగింటి వాళ్లు వెళ్లి చూడగా.. భార్యభర్తలు ఇద్దరూ తీవ్ర గాయాలతో పడి ఉండటం కనిపించింది. ఇద్దరూ హాస్పిటల్కు తరలిస్తుండా.. సంతోష్ మీనా మధ్యలోనే మృతి చెందింది. సుల్తాన్ సింగ్ను జైపూర్కు తరలించారు. ఈ ఘటన జరిగిన సమయంలో వాళ్ల ఇద్దరు పిల్లలు ఇంట్లో లేకపోవడంతో వాళ్లు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.