న్యూఢిల్లీ: కోవిడ్ రోగులు అతిగా స్టెరాయిడ్స్ వాడినా లేక.. తప్పుగా వాటిని వేసుకున్నా.. లేక విచ్చలవిడిగా వాడినా.. దాని వల్ల బ్లాక్ ఫంగస్ వస్తోందని ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ మెడికల్ డైరక్టర్, డాక్టర్ సురేశ్ కుమార్ తెలిపారు. చాలా అరుదైన సందర్భాల్లో బ్లాక్ ఫంగస్ వల్ల రోగులు మరణిస్తారన్నారు. ఎక్కువ శాతం రోగులు కోవిడ్ వల్లే ప్రాణాలు కోల్పోతున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే స్టెరాయిడ్స్ వాడకాలను తగ్గించాలని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆక్సిజన్ లెవల్ 90 దాటిన రోగికి స్టెరాయిడ్స్ ఇస్తే, ఆ వ్యక్తికి సైడ్ ఎఫెక్ట్ రూపంలో బ్లాక్ ఫంగస్ అంటుకునే అవకాశం ఉన్నట్లు డాక్టర్ సురేశ్ తెలిపారు. అయితే ఆ స్థాయి కన్నా ముందే బ్లాక్ ఫంగస్ను గుర్తించడం వీలుకాదన్నారు. ముఖానికి చెందిన సీటీ స్కాన్ ద్వారా ఈ ఇన్ఫెక్షన్ను గుర్తించే అవకాశాలు ఉన్నట్లు డాక్టర్ సురేశ్ తెలిపారు.
బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ప్రస్తుతం యాంటీ ఫంగల్ మందు ఆంఫోటెరిసిన్ వాడుతున్నట్లు ఆయన వెల్లడించారు. గత వారం తమ హాస్పిటల్లో ప్రతి రోజు వంద మందిపైగా రోగులు వచ్చేవారని, ఇప్పుడు ఆ సంఖ్య 50 నుంచి 60 రోగులకు తగ్గిందన్నారు. మా హాస్పిటల్లో 17000 బెడ్స్ ఉన్నాయని, దాంట్లో ప్రస్తుతం 990 బెడ్స్ ఖాళీగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి మెరుగవుతున్నదని, కానీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలన్నారు.
డయాబెటిక్ రోగుల్లోనే..
డయాబెటిక్ రోగుల్లోనే అధిక సంఖ్యలో బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడుతున్నట్లు ఎయిమ్స్ డైరక్టర్ రణ్దీప్ గులేరియా తెలిపారు. ముకోర్మైకోసిస్ వ్యాధిగా పిలువబడే బ్లాక్ ఫంగస్ .. ముఖంపై ప్రభావం చూపగలదు. ముక్కు, కన్ను, బ్రెయిన్కు కూడా దాని వల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో చూపును కూడా కోల్పోయే ప్రమాదం ఉన్నదని, అది ఊపిరితిత్తులకు కూడా వ్యాప్తి చెందుతుందని రణ్దీప్ గులేరియా తెలిపారు. డయాబెటిక్ రోగుల్లో బ్లాక్ ఫంగస్ వృద్ధికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. స్టిరాయిడ్స్ను తప్పుడు పద్ధతిలో వాడడం వల్ల కూడా ఈ సమస్య ఉత్పన్నం అవుతుందన్నారు. కోవిడ్ కన్నా ముందు చాలా తక్కువ సంఖ్యలో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యేవని, కానీ ఇప్పుడు భారీ స్థాయిలో కేసులు నమోదు అవుతున్నట్లు ఆయన తెలిపారు. ఎయిమ్స్లో 23 మంది బ్లాక్ ఫంగస్ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.