న్యూఢిల్లీ: మనిషి తన గొయ్యి తానే తవ్వుకుంటున్నాడు. చేజేతులా భవిష్యత్ తరాల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాడు. పర్యావరణంలో వస్తున్న మార్పులను పట్టించుకోకుండా అభివృద్ధి పేరుతో సాగిస్తున్న ప్రకృతి విధ్వంసం మానవాళికి పెను ముప్పులా పరిణమిస్తోంది. మన జీవ నదులకు మూలమైన హిమాలయన్ గ్లేసియర్లే ఇప్పుడు భయపెడుతున్నాయి. ఇవి ఊహించని వేగంతో కరిగిపోతుండటం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. దీనివల్ల ఏకంగా వంద కోట్ల మంది జీవితాలు ప్రమాదంలో పడనున్నట్లు ఐఐటీ ఇండోర్ అధ్యయనం తేల్చింది.
గ్లేసియర్లకు వచ్చిన ముప్పేంటి?
హిమాలయన్ కారకోరంలో నదుల పరిస్థితిపై ఐఐటీ ఇండోర్ టీమ్ అధ్యయనం చేసింది. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఇక్కడి గ్లేసియర్లు చాలా వేగంగా కరిగిపోతున్నట్లు తేలింది. దీనివల్ల సింధు, గంగ, బ్రహ్మపుత్ర నదుల్లో నీటి మట్టం రానున్న దశాబ్దాల్లో భారీగా పెరగనుంది. ఫలితంగా ఈ నదుల దిగువ మైదానాల్లో వచ్చే వరదలు కోట్ల మంది జీవితాలను అతలాకుతలం చేయనున్నాయి.
ఈ గ్లేసియర్లు ఇలా కరుగుతూ వెళ్తే నదుల్లో నీటి మట్టం క్రమం పెరుగుతూ తర్వాత తగ్గిపోతుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఈ జీవ నదుల్లో అసలు నీటి ప్రవాహమే ఉండని దుస్థితి తలెత్తుందని ఐఐటీ ఇండోర్ అధ్యయనం స్పష్టం చేసింది. ఈ అధ్యయనాన్ని సైన్స్ జర్నల్లో ప్రచురించారు. ఐఐటీ ఇండోర్ ప్రొఫెసర్ అయిన డాక్టర్ మహ్మద్ ఫరూక్ ఆజం నేతృత్వంలో జరిగిన ఈ అధ్యయనం.. హిమాలయన్ కారకోరంలో గ్లేసియర్, మంచు కరగడం సింధులాంటి నదులకు చాలా ముఖ్యమైన అంశమని చెబుతోంది.
గ్లేసియర్లు ఎలా కరుగుతున్నాయి?
ఈ టీమ్లోని పరిశోధకులు 250 పరిశోధన పత్రాలను అధ్యయనం చేసింది. వాటి ఆధారంగా గ్లోబల్ వార్మింగ్, వర్షపాతంలో వస్తున్న మార్పులు, గ్లేసియర్లు కుంచించుకు పోవడం మధ్య ఉన్న సంబంధంపై ఓ అంచనాకు వచ్చారు. దీని గురించి డాక్టర్ ఆజం వివరించారు. హిమాలయన్ నదీ పరీవాహక ప్రాంతాలు 27.5 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. 5,77,000 చదరపు కిలోమీటర్ల మేర సాగుభూమి దీని కింద ఉంది. ఇక 26,432 మెగావాట్లతో ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం ఉన్న హైడ్రోపవర్ ప్రాజెక్టులు వీటిపై ఉన్నాయి. ఈ ప్రాంతంలోని 100 కోట్ల మంది అవసరాలను ఈ కరుగుతున్న గ్లేసియర్లు తీరుస్తున్నాయి అని డాక్టర్ ఆజం చెప్పారు.
ఈ శతాబ్దం మొత్తం గ్లేసియర్లలో ఎక్కువ భాగం ఇలా కరిగిపోతే అది ఈ 100 కోట్ల మందిపై ప్రభావం చూపుతుంది. ఈ గ్లేసియర్లపై ఆధారపడిన నదుల్లో క్రమంగా నీటి లభ్యత లేకుండా పోతుందని డాక్టర్ ఆజం చెప్పారు. గంగా, బ్రహ్మపుత్ర నదుల్లో ఎక్కువ భాగం నీళ్లు వర్షాల కారణంగా వస్తున్నా.. సింధు నది మాత్రం పూర్తిగా ఈ గ్లేసియర్లపైనే ఆధారపడి ఉంది. అయితే అటు వర్షపాతంలో వస్తున్న మార్పులు గంగా, బ్రహ్మపుత్ర నదులపైనా తీవ్రమైన ప్రభావం చూపనున్నాయి.
ఈ ముప్పును ఎలా ఆపాలి?
2050 వరకూ గ్లేసియర్లు కరగడం, నదుల్లో నీటి మట్టాలు పెరగడం జరుగుతూనే ఉంటాయని, ఆ తర్వాత క్రమంగా నదుల్లో నీటి మట్టాలు తగ్గుతూ వెళ్తాయని ఈ అధ్యయనం తేల్చింది. సమస్యలపై దృష్టి సారించి, ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి, భవిష్యత్తులో ఈ నదుల్లో సంభవించే మార్పులకు అనుగుణంగా నీటి నిర్వహణ చేపట్టాలని సూచించింది.
ముఖ్యంగా మూడు దశల పరిష్కారాన్ని ఈ అధ్యయనం చూపిస్తోంది. గ్లేసియర్లపై పర్యవేక్షణ పెంచాలి. ఎంపిక చేసిన గ్లేసియర్లపై పూర్తి ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఎప్పటికప్పుడు గ్లేసియర్ వైశాల్యాన్ని పరిశీలిస్తూ ఉండాలి. వీటి అధ్యయనాల వివరాలను గ్లేసియర్ హైడ్రాలజీలో చేర్చాలి. తద్వారా అంచనాల్లో అనిశ్చితిని తగ్గించాలి. ఐఐటీ ఇండోర్ చేసిన ఈ అధ్యయనం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగింది.