న్యూఢిల్లీ: కోవిడ్ టీకా తీసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టినట్లు ప్రపంచవ్యాప్తంగా కొన్ని కేసులు బయటపడిన విషయం తెలిసిందే. ఆస్ట్రాజెనికా, జే అండ్ జే, స్పుత్నిక్ టీకాలు తీసుకున్న వారిలో ఈ కేసులు నమోదు అయ్యాయి. అడినోవైరస్ నుంచి ఆ కోవిడ్ టీకాలను రూపొందించారు. అయితే ఈ టీకాలు తీసుకున్న కొందరిలో ఎందుకు రక్తం గడ్డకడుతుందో పరిశోధకులు తేల్చారు. చేతి భుజానికి టీకా ఇస్తున్న సమయంలో.. సరైన రీతిలో ఇంజక్షన్ గుచ్చకుంటే.. దాని వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉన్నట్లు ఓ స్టడీలో తేల్చారు. జర్మనీ, ఇటలీలో ఎలుకలపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు. జర్మనీలోని మునిచ్ యూనివర్సిటీ, ఇటలీలోని రీసర్చ్ ఇన్స్టిట్యూట్లు ఈ అధ్యయనం చేప్టటాయి. నేరుగా రక్తనాళాల్లోకి టీకాలను ఇవ్వడం వల్ల.. అలాంటి కేసుల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ప్రమాదవశాత్తు టీకాలను నేరుగా రక్తనాళాల్లోకి ఎక్కించడం వల్ల త్రాంబాటిక్ త్రాంబోసైటోపెనిక్ సిండ్రోమ్ (టీటీఎస్) లక్షణాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి.
కోవిడ్పై ఏర్పాటు చేసిన ఐఎంఏ నేషనల్ టాస్క్పోర్స్ డాక్టర్ రాజీవ్ జయదేవన్ దీని గురించి వివరించారు. టీకా ఇస్తున్న సమయంలో ఒకవేళ సూది భుజం లోతులోకి వెళ్లకున్నా లేక రక్తనాళంలోకి నేరుగా వెళ్లినా.. దాని వల్ల ఈ సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సరైన శిక్షణలేని హెల్త్వర్కర్ చర్మం మీదనే ఇంజక్షన్ గుచ్చడం వల్ల ఇలా జరిగే అవకాశాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.