చెన్నై : కొవిడ్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను భేఖాతరు చేస్తూ మాస్కులు ధరించనివారిపై పోలీసులు 85 వేల పైచిలుకు కేసులు నమోదు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది. పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు చెన్నైలోని పోలీస్ క్వార్టర్స్లో శనివారం కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమం ప్రారంభం అనంతరం చెన్నై నగర పోలీసు కమిషనర్ మహేష్ కుమార్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 3,315 మంది పోలీసు సిబ్బంది కొవిడ్-19 బారిన పడ్డట్లు తెలిపారు. నగరంలో కేవలం 6 వేల మంది పోలీసు సిబ్బంది మాత్రమే వాక్సిన్ వేసుకున్నట్లు చెప్పారు. వాక్సిన్ వేసుకోవడానికి సిబ్బంది ముందుకు రావాలన్నారు.
శాంతిభద్రతలు, నేరాల నివారణ, ట్రాఫిక్ను నియంత్రించడం పోలీసు బలగాల ప్రాథమిక కర్తవ్యం అన్నారు. అన్నింటికిమించి ఇది ప్రజా సేవ కాబట్టి మహమ్మారి సమయంలో ప్రజల ఫిర్యాదులను పరిష్కరించాల్సిన బాధ్యత పోలీసు సిబ్బందికి ఉంటుంది కాబట్టి కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉంటుందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని సిబ్బంది తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
మాస్కులు ధరించనందుకు ఇప్పటివరకు 85,764 కేసులు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. అదేవిధంగా క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 117 కేసులు, భౌతికదూరం పాటించనందుకు 1,50,318 కేసులు నమోదు చేసినట్లు పోలీసు కమిషనర్ తెలిపారు.