శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో 700 మందికిపైగా వ్యక్తులను భద్రతా దళాలు నిర్బంధించాయి. ఉగ్రవాదులు పౌరులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపిన ఘటనల్లో గత ఆరు రోజుల్లో కశ్మీర్ పండిట్లు, సిక్కు, ముస్లిం మతానికి చెందిన ఏడుగురు హత్యకు గురయ్యారు. ఒక స్కూల్ ప్రిన్సిపల్, ఇద్దరు టీచర్లు, ఒక ఫార్మసిస్ట్, ట్యాక్సీ డ్రైవర్, బీహార్కు చెందిన ఒక వీధి వ్యాపారి మరణించిన వారిలో ఉన్నారు.
ఉగ్రవాదులు వరుసగా పౌరులను లక్ష్యంగా చేసుకొన్న నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం, భద్రతా సంస్థలకు చెందిన ఉగ్రవాద నిరోధక ప్రత్యేక నిఫుణులను శ్రీనగర్కు పంపింది. దీంతో గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులకు మద్దతిచ్చే, సహకరించే వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఆదివారం నాటికి భద్రతా దళాలు నిర్బంధించిన వారి సంఖ్య 700కుపైగా పెరిగింది. నిషేధిత జమాతే-ఇ-ఇస్లామీ, ఉగ్రవాదుల కార్యకలాపాలకు సహకరించే అనుమానిత వ్యక్తులు ఇందులో ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
కాగా, కశ్మీర్ లోయలో జరుగున్న వరుస ఉగ్రదాడుల గొలుసును బ్రేక్ చేసేందుకు ఈ మేరకు అనుమానిత వ్యక్తులను భారీ స్థాయిలో అదుపులోకి తీసుకున్నట్లు ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు తమ నియంత్రణలోకి తెచ్చుకున్న అనంతరం జమ్ముకశ్మీర్లో రాడికలిజం ఊపందుకున్నదని, దీంతో పౌరుల లక్ష్యంగా ఉగ్రదాడులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. దీనిని అరికట్టేందుకు ప్రత్యేక భద్రతా దళాలు రంగంలోకి దిగినట్లు వెల్లడించారు.