బెంగళూర్ : కర్నాటకలో నాయకత్వ మార్పు ఉంటుదనే ప్రచారం నేపథ్యంలో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు 65 మందికి పైగా ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా మద్దతు పలికారని హన్నహళ్లి ఎమ్మెల్యే, యడియూరప్ప రాజకీయ కార్యదర్శి ఎంపీ రేణుకాచార్య వెల్లడించారు. కర్నాటక పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ అరుణ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ, కర్నాటక పార్టీ చీఫ్ నలిన్ కతీల్ లతో తాను మాట్లడగా వారంతా యడియూరప్ప నాయకత్వానికి మద్దతు పలికారని చెప్పారు.
మరోవైపు యడియూరప్ప రాజీనామా చేయాలని బీజేపీ హైకమాండ్ కోరలేదని, కరోనా మహమ్మారి నియంత్రణపైనే పార్టీ పూర్తిగా కసరత్తు సాగిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పష్టం చేశారు. నాయకత్వ మార్పు దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదని కర్నాటక బీజేపీ చీఫ్ నలిన్ కతీల్ సైతం పేర్కొన్నారు. ఇక పార్టీ హైకమాండ్ కోరితే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని యడియూరప్ప స్పష్టం చేశారు.తనకు వ్యతిరేకంగా ఎవరేం మాట్లాడినా స్పందించబోనని అన్నారు.