న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా సాగుతున్నది. అందుకోసం కేంద్రం ఎప్పటికప్పుడు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యాక్సిన్లను ( vaccines ) పంపిణీ చేస్తున్నది. ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మొత్తం 57.88 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. త్వరలో మార్గమధ్యలో ఉన్న మరో 18,62,530 డోసులు రాష్ట్రాలకు చేరుకోనున్నాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది.
కాగా, వృథాగా పోయిన వాటితో కలిపి బుధవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 55,11,64,635 వ్యాక్సిన్ డోసులను వినియోగించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల దగ్గర 94 లక్షల వ్యాక్సిన్ డోసులు నిలువ ఉన్నాయని తెలిపింది.