లక్ష్యం బొగ్గు ఉత్పత్తి చేరుకోవడంలో వెనుకంజ
ఇప్పటివరకు సరాసరి 72 శాతమే ఉత్పత్తి
లాక్డౌన్తో 45 పనిదినాలు కోల్పోయిన సంస్థ
వచ్చే ఆర్థిక సంవత్సరానికి 70.53 మిలియన్ టన్నుల లక్ష్యం
మంచిర్యాల టౌన్(శ్రీరాంపూర్), మార్చి 30:సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని చేరుకోలేక పోయింది. లక్ష్యంలో 72 శాతం ఉత్పత్తి మాత్రమే సాధించింది. ప్రధానంగా గతేడాది మార్చి 23 నుంచి విధించిన లాక్డౌన్తో సంస్థ 45 రోజులు పని దినాలు కోల్పోగా.. కరోనాతో కార్మికుల గైర్హాజరు పెరిగింది. కాగా.. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను 70.53 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టారు.
సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తిపై కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా పడింది. ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యాలు సాధించడంలో వెనుకబడింది. సింగరేణి సంస్థకు ప్రభుత్వం 2020-21 ఆర్థిక సంవత్సరం నిర్ధేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 70.35 మిలియన్ టన్నులకు గాను ఇప్పటివరకు కేవలం 72.5 శాతం బొగ్గు ఉత్పత్తి మాత్రమే సాధించడం జరిగింది. మిగిలిన రెండు రోజుల్లో రోజుకు 2,58,492 లక్షల టన్నుల చొప్పున ఉత్పత్తి రావాల్సి ఉంది. గడిచిన ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి 27.5 శాతం వెనుకబడింది. సింగరేణికి రానున్న 2021-22 ఆర్థిక సంవత్సరం బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 70.53 మిలియన్ టన్నులుగా నిర్ణయించింది. ఇప్పటివరకు బొగ్గు ఉత్పత్తి సాధించడంలో ఆర్జీ-3 ఏరియా 105 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. అలాగే 2వ స్థానంలో ఆర్జీ-2 ఏరియా 98 శాతంతో ఉంది. కొత్తగూడెం 64 శాతం, ఇల్లందు 79 శాతం, మణగూరు ఏరియా 87 శాతం, ఆర్జీ-1 ఏరియా 49 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించాయి. భూపాలపల్లిలో 50 శాతం, బెల్లంపల్లిలో 38 శాతం, మందమర్రిలో 48 శాతం, శ్రీరాంపూర్ ఏరియాలో 73 శాతం బొగ్గు ఉత్పత్తి జరిగింది. సింగరేణిలో 25 భూగర్భ గనుల్లో 46 శాతం, 20 ఓసీపీల్లో 75.4 శాతం బొగ్గు ఉత్పత్తి జరిగింది. సింగరేణి భూగర్భ గనుల్లో 164 ఎస్డీఎల్ యంత్రాలు ఉండగా 146 ఎస్డీఎల్ యంత్రాలు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి. ఎస్డీఎల్ యంత్రాలతో 62 శాతం బొగ్గు ఉత్పత్తి జరిగింది.
ఉత్పత్తిపై కరోనా ఎఫెక్ట్
సింగరేణి సంస్థపై కరోనా ఎఫెక్ట్ తీవ్రంగా పడింది. గతేడాది మార్చి 23 నుంచి విధించిన కరోనా లాక్డౌన్తో సంస్థ 45రోజులపాటు ఉత్పత్తి పనిదినాలను కోల్పోయింది. దీంతో సంస్థకు 27.5 శాతం బొగ్గు ఉత్పత్తి నష్టం జరిగింది. అలాగే బొగ్గు డిమాండ్ కూడా తగ్గి సంస్థలో నిల్వలు ఉన్నాయి. బొగ్గు రవాణా కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. విధుల్లో కార్మికుల గైర్హాజరు, కరోనా వల్ల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపింది. సింగరేణి ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా నివారణ చర్యలు చేపట్టినప్పటికీ 45 రోజు ల ఉత్పత్తిని నష్టపోవాల్సి వచ్చింది. కరోనాతో చిన్నతరహా పరిశ్రమలు నడువలేని పరిస్థితి ఏర్పడింది. కేవలం విద్యుత్ పరిశ్రమలకు బొగ్గు సరఫరా అయింది. ఈ ఏడాది సంస్థకు లాభాలు పెద్దగా రావని చెప్పవచ్చు.
ఇవి కూడా చుడండి
సీఎం కేసీఆర్కు టీజీవో ధన్యవాదాలు