న్యూఢిల్లీ : మహమ్మారిపై పోరాటంలో ముందున్న పోలీసులు ఢిల్లీలో కరోనా బారినపడ్డారు. సుమారు 3000 మంది సిబ్బంది పాజిటివ్గా పరీక్షలు చేశారని, వీరిలో 15 మందిని హాస్పిటల్లో చేర్పించగా.. మిగతా వారంతా హోం క్వారంటైన్లో ఉన్నారని ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవ తెలిపారు. నగరంలో కొవిడ్-19 కేసులు అకస్మాత్తుగా పెరగడంతో గడిచిన కొద్ది రోజులుగా సిబ్బంది పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్గా వచ్చినట్లు పేర్కొన్నారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో కరోనా నిబంధనలు పాటిస్తున్నారని, అయినా కొందరు వైరస్ బారినపడుతున్నారని చెప్పారు. విధుల్లో ఉన్న సమయంలో తప్పనిసరిగా మూడు పొరలున్న లేదంటే.. ఎన్-95 మాస్క్లు ధరించడం, సామాజిక దూరం నిబంధనలు, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సిబ్బందికి సూచించారు.
ఇదిలా ఉండగా నిన్న ఒకే రోజు ఢిల్లీలో 16,699 పాజిటివ్ కేసులు, 112 మరణాలు నమోదయ్యాయని ఢిల్లీ ఆరోగ్యశాఖ గురువారం తెలిపింది. దేశ రాజధానిలో వరుసగా 10వేలకుపైగా కేసులు నమోదవడం ఐదోరోజు. ప్రస్తుతం ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 7.84లక్షలకు చేరగా.. 54,309 క్రియాశీల కేసులున్నాయి. ఇప్పటికే వైరస్కు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం శుక్రవారం నుంచి వారాంతపు కర్ఫ్యూను విధించింది.