పరిగి, మార్చి 27 : ‘చిన్నారులకు మొదటి గురువు తల్లి.. నడక, నడవడిక నేర్పేది అమ్మలే.. మన సంస్కృతి, సంప్రదాయాలను నేర్పి చక్కదిద్దే అమ్మలు గురువు పాత్రనూ పోషిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా బడులు బంద్ కాగా, ఆన్లైన్ క్లాసులను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చిన్నారులు ఇంట్లోనే ఉండి ఆన్లైన్ క్లాసులు వింటుండడంతో తల్లులకు మరింత బాధ్యత పెరిగింది. ఫోన్లో జూమ్ యాప్ను ఓపెన్ చేసి దగ్గరుండి క్లాసులను వినేలా చూసుకుంటున్నారు. ఆటలు, టీవీ, సెల్ఫోన్లకు పరిమితమవుతున్న చిన్నారులను చక్కదిద్దుతూ.. చదువులో తమ సహకారాన్ని అందిస్తున్నారు.
హోంవర్క్ దగ్గర నుంచి..
పిల్లల హోంవర్క్ విషయంలోనూ అమ్మలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ఉదయం నిద్ర లేపడం మొదలు క్లాసులు విన్న తర్వాత హోం వర్క్ చేయించే వరకు వెన్నంటి ఉండి చదువుకు సాయం చేస్తున్నారు. పూర్తయిన హోంవర్క్ను ఆన్లైన్లో ఉపాధ్యాయులకు పంపించి పిల్లల చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక పరీక్షల సమయంలో గంటల తరబడి పిల్లలతోపాటు కూర్చొని చదివిస్తున్న అమ్మలు… పుస్తకాలను తిరిగేస్త్తూ ఉపాధ్యాయుల పాత్రను పోషిస్తున్నారు.
ఆన్లైన్ తరగతులతోపెరిగిన బాధ్యత…
ఈ విద్యా సంవత్సరం జూన్లో ప్రారంభం కావాల్సి ఉండగా, కరోనా నేపథ్యంలో బడులు తెరుచుకోలేదు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ సర్కారు టీశాట్, దూరదర్శన్ యాదగిరి చానళ్లలోనూ డిజిటల్ తరగతులను ప్రసారం చేస్తున్నది. ఇక ప్రైవేటు విద్యాసంస్థలు జూలై నెలాఖరు నుంచి జూమ్, తదితర యాప్లతో ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. దీంతో పిల్లల చదువులపై తల్లులకు మరింత బాధ్యత పెరిగింది. పిల్లలతో పాటు ఆన్లైన్ తరగతులు వింటూ దగ్గరుండి పిల్లలు పాఠాలు వినేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆన్లైన్ తరగతుల కోసం సెల్ఫోన్, ల్యాప్టాప్లను కొనుగోలు చేశారు. ఉద్యోగం చేసే అమ్మలపై అటు పనిలోనూ, ఇటు పిల్లల చదువుతో మరింత భారం పడింది.
సందేహాల నివృత్తి..
సిలబస్లో చిన్నారులకు వచ్చే సందేహాలను తల్లులు నివృత్తి చేస్తున్నారు. దగ్గరుండి చదివించడం, మరోసారి రివిజన్ చేయిస్తూ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. పరీక్షల అనంతరం ఉపాధ్యాయులు ఆన్సర్ షీట్లతోపాటు వారికి వచ్చిన మార్కులను ఆన్లైన్లో పంపిస్తుండగా, ఏ ప్రశ్నకు ఏ సమాధానం రాశారు, ఎందుకు తప్పు పోయిందంటూ తమ పిల్లలను చక్కబెట్టుకుంటున్నారు. బోర్డుపై రాసే అంశాలు పిల్లలకు అర్థంకాని సందర్భంలో అర్థమయ్యేలా వివరిస్తున్నారు. పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకుంటుండగా విద్యాబోధనకు అవసరమైన సూచనలు, సలహాలను సైతం తల్లులు అందజేస్తున్నారు. చిన్నారులు ఫోన్లలో గేమ్స్ ఆడితే వారించి చదువుకునేలా చూసుకుంటున్నారు. ఆన్లైన్ క్లాసుల తర్వాత ఫోన్లను వారి నుంచి దూరంగా ఉంచుతున్నారు.
దగ్గరుండి చదివించాల్సి వస్తుంది…
ఆన్లైన్ క్లాసులను వినేలా చూసుకుని దగ్గరుండి చదివిస్తున్నాం. ఉదయం 9 గంటలకే క్లాసులు ప్రారంభమవుతున్నాయి. ఈ లోపే పిల్లలను సిద్ధం చేస్తున్నాం. ఎప్పటికప్పుడు హోంవర్క్ చేయిస్తున్నాం. ఏమైనా సందేహాలు ఉంటే వాటిని నివృత్తి చేస్తున్నాం. మాకు అర్థం కాకపోతే సంబంధిత టీచర్కు ఫోన్ చేసి తెలుసుకుంటున్నాం.
భారం పెరిగింది..
ఇది వరకు పిల్లలను తయారు చేసి స్కూల్కు పంపిస్తే సరిపోయేది. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులను వినిపించడంతోపాటు దగ్గరుండి చదివించాల్సి వస్తుంది. ఇంటి పనితోపాటు పిల్లలను చూసుకుంటుండడంతో పని భారం పెరిగింది. ఫోన్లో పాఠాలు వింటున్నారా లేదా అని పరిశీలించాల్సి వస్తుంది. శ్రద్ధగా పాఠాలు వినేలా పిల్లల పక్కనే కూర్చోవాల్సి వస్తుంది.