సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో పారిశుధ్య కార్యక్రమాల పర్యవేక్షణకు మేయర్ గద్వాల విజయలక్ష్మి పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆమె పర్యటన కొనసాగింది. తొలుత ఉస్మానియా దవాఖానను ఆమె సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన అన్నపూర్ణ కేంద్రం వద్ద పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని.. భోజన కేంద్రాన్ని పరిశుభ్రమైన వాతావరణంలోకి మార్చాలని ఆధికారులను ఆదేశించారు. అనంతరం దవాఖాన లోపల పారిశుధ్య పనులను పర్యవేక్షించారు. కరోనా రోగులతో మాట్లాడారు. బాధితుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరిస్తానని.. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని.. ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా మేయర్ వారికి హామీ ఇచ్చారు.