ఉక్కు సంకల్పమే కొవిడ్ రుగ్మతకు విరుగుడు
సానుకూల దృక్పథంతో ఒత్తిడిని అధిగమించొచ్చు
ప్రతికూల ఆలోచనలతో యువత ఉక్కిరిబిక్కిరి
కరోనా విస్తృతి నేపథ్యంలో పెరుగుతున్న జాడ్యం
భయాందోళనను వీడి జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు
కంటికి కనిపించని వైరస్ ప్రతి ఒక్కరికీ కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి మనలో ఉన్నప్పటికీ ఏదో తెలియని భయం వెంటాడుతున్నది. కొవిడ్ సోకిన వెంటనే తీవ్ర ఆందోళనకు గురవుతుండడం.. ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నది. చాలామంది సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వైరస్ బారిన పడుతున్నారు. ఆరోగ్య సమస్యలేవీ లేనివారు సైతం భయపడుతుండగా.. ఆస్తమా, ఇతర శ్వాస సంబంధిత సమస్యలున్నవారు, వయోధికులు ఉక్కుసంకల్పంతో కరోనాతో పోరాడి గెలుస్తున్నారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ పూర్తిగా కోలుకుంటున్నారు. తనకు ఏమీ కాదనే అతివిశ్వాసం కారణంగానే అత్యధిక యువత వైరస్ బారిన పడుతున్నారు. అనవసరపు ఆందోళన కన్నా.. అవగాహన, ఆత్మస్థైర్యంతోనే వైరస్ను ఓడించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
‘రాజు ఉన్నత చదువులకు అమెరికా వెళ్లాలని ఎన్నో కలలు కన్నాడు. అందుకు తగినట్లుగానే సరదాలు వదిలేసి ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. మే నెలాఖరుకు ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలో మహమ్మారి అతడి ఆశలను వమ్ము చేసింది. ఎటూ పాలుపోని స్థితిలోకి నెట్టివేసింది. కరోనా బారిన పడడంతో పూర్తిగా కుంగదీసింది. దీంతో ఆ యువకుడు ఆందోళనకు గురయ్యాడు. కరోనాను జయించాడు. కానీ అమెరికా ప్రయాణంపై బెంగతో రాజు పరిస్థితి గందరగోళంలో పడేసింది. తిండి మానేసి తనను తాను నిందించుకుంటూ మౌనంగా ఉండడం మొదలు పెట్టాడు. గమనించిన తల్లిదండ్రులు కొడుకు ఆరోగ్య స్థితిపై ఆందోళన చెందారు. మానసిక నిపుణుడి వద్దకు తీసుకెళ్లారు. రెండుసార్లు కౌన్సిలింగ్ నిర్వహించాక క్రమంగా మార్పు వస్తుందనుకునే సమయంలో తీవ్ర ఆందోళనలోనే ప్రాణం వదిలాడు. చెట్టంత కొడుకు తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా మారింది. అమాయకుడైన రాజు మరణించడానికి ప్రధాన కారణం.. తెలియని భయం ఆవహించడమేనని వైద్యులు చెబుతున్నారు. కరోనా మహమ్మారి మూలంగా చాలా మంది యువతలో తీవ్రమైన భయాలు ఊహించని మలుపులు తిప్పుతోంది. తద్వారా మానసికంగా బలహీనమవుతూ కరోనాతో పోరాడకుండానే తనువు చాలిస్తున్నారు.
నిజామాబాద్, మే 8, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కంటికి కనిపించని వైరస్ ప్రపంచాన్నే భయపెడుతోంది. కారణం అదీ, దాని బలం కాదు.. మనలోని బలహీనత. అతి సూక్ష్మమైన వైరస్ను ఎదుర్కొనే శక్తి ఉన్నప్పటికీ ఏదో తెలియని భయం మనల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఏదో అయిపోతుందనే ఆందోళన మన ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తోంది. జాగ్రత్తలు మరిచి కరోనాకు దారి ఇస్తున్నాం. కోలుకునేందుకు రూ.లక్షలు వెచ్చిస్తున్నాం. కరోనా అంటే ఏ ఆరోగ్య సమస్యలు లేనివారే భయపడుతున్నారు. ఇక ఆస్తమా, శ్వాస సంబంధిత, ఊపిరితిత్తుల సమస్యలుంటే వారి మానసిక పరిస్థితి చెప్పనవసరం లేదు. కానీ అలాంటి వారూ ఉక్కు సంకల్పంతో పోరాడి గెలుస్తున్నారు. పూర్తిగా కోలుకుంటున్నారు. కరోనాతో అలుపెరుగని పోరాటం చేసి విజేతలుగా నిలుస్తున్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య ప్రజానీకం తమ వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా పాటించడంతోపాటు మనల్ని మనం కాపాడుకునేందుకు మాస్కులు ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యమైన పనులుంటే తప్ప ఇండ్ల నుంచి బయటికి వెళ్లడం మానుకోవాలని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి. ప్రయాణాలు, శుభ కార్యాలు వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అవుతుందని ప్రచారం చేస్తున్నారు.
కొంప ముంచుతున్న అతివిశ్వాసం…
కరోనా వైరస్ ముందు అతి విశ్వాసం ఏ మాత్రం పని చేయదు. అందుకు అనేక ఉదాహరణలున్నాయి. నాకు బలమైన కండలున్నాయి. నాకేం కాదు అనుకుంటే పొరపాటే. నాకెలాంటి రోగాలు లేవు. నేను బహిరంగంగా మాస్కులు లేకుండా తిరిగినా వైరస్ సోకదు అని భావిస్తే అదంతా భ్రమేనని వైద్యులు అంటున్నారు. కరోనా వైరస్కు మనిషిలోని గుణగణాలతో సంబంధం లేదని, వయస్సుతోనూ ఎలాంటి అడ్డంకులు లేవని తేల్చిచెబుతున్నారు. ముఖ్యంగా యువతలో ఈ రకమైన జాడ్యం మూలంగా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. నాకేం… తక్కువ వయస్సు. నాకు వచ్చినా రెండు, మూడు రోజుల్లో వైరస్ వెళ్లిపోతుందనుకునే వారిపై వైద్యాధికారులు సీరియస్గా దృష్టి సారిస్తున్నారు. సెంకడ్ వేవ్లో ఇలాంటి భావన కలిగి ఉన్న వారితోనే భారీ నష్టం వాటిల్లుతోంది. యువతలో వైరస్ లక్షణాలు బయట పడకపోయినప్పటికీ వారి ద్వారా ఇతరులకు వ్యాపించే ఆస్కారం ఎక్కువగా ఉంది. ఇంట్లో తల్లిదండ్రులు, వృద్ధులు, పిల్లలకు వైరస్ అంటుకోవడానికి యువతే వాహకంలా మారుతున్నారు. వీరి అతివిశ్వాసం మూలంగానే చాలా మంది పెద్దవారు కన్నుమూసిన ఘటనలూ గడిచిన నెలన్నర రోజుల్లో అనేకం ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.
అపోహలు వీడి… అవగాహనతో మెదిలి…
కరోనా నేపథ్యంలో మనం ఎవరికైనా ఫోన్ చేస్తే ముందు పలు రకాల కాలర్ ట్యూన్లు వినిపిస్తున్నాయి. నమస్కారం… నోవల్ కరోనా వైరస్ లేదా కొవిడ్ 19తో దేశం మొత్తం యుద్ధం చేస్తుంది. కానీ గుర్తుంచుకోండి. మనం పోరాడాల్సింది వ్యాధితో రోగితో కాదు. వారిని వివక్షతో చూడకండి. పరిరక్షించండి. అంటూ సాగే ట్యూన్ ఏడాది కాలంగా అందరినీ ఆలోచింపజేసింది. ప్రస్తుతం సెకండ్ వేవ్ టైమ్లో కాలర్ ట్యూన్లో వ్యాక్సినేషన్ ప్రాధాన్యతపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రజల్లో కరోనా వైరస్ పట్ల అవగాహన, అప్రమత్తత పెరగాల్సిన ఆవశ్యకత ఉంది. అపోహలతో కాలం వెళ్లదీయడం ద్వారా చాలా మంది తమకు తెలిసీ తెలియని వైద్యంతో కీలకమైన కరోనా వ్యాప్తి దశలో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. వైరస్ సోకిన వాళ్లతోనే మనకు కరోనా వ్యాపిస్తుందని వాళ్లనే లక్ష్యంగా చేసుకుని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోదు. నిత్యం మనం కొవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. అత్యసవరమైతే తప్ప బయటికి వెళ్లకపోవడం, ఇంట్లో ఉండడం ఉత్తమం. ఒకవేళ వెళ్లినా మాస్కు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటిస్తూ శానిటైజర్లు వాడాలి. ఇంట్లో ఉన్నా తరచూ సబ్బుతో చేతులను శుభ్రం చేసుకుంటే కొవిడ్ను జయించవచ్చని వైద్యులు చెబుతున్నారు. కరోనా సోకిన వ్యక్తికి దగ్గరగా ఉన్నప్పుడు లేదా వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు సమీపంలో ఉంటే ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంటుంది.
ఉల్లాసమే జీవితానికి ఉత్సాహం…
కరోనాను తలచుకుంటూ విపరీతమైన భయాందోళనకు గురికావొద్దు. అవగాహన పెంచుకుంటూ ఆత్మవిశ్వాసంతో ఉండాలి. వైరస్ బారిన పడిన వారు, క్వారంటైన్, ఐసొలేషన్లో ఉండడానికి భయపడుతున్నారు. బయట తిరగకుండా ఒంటరిగా ఉండాలనే ఆలోచన దీనికి కారణం. తమ తోటివారికి హాని కలుగజేయకుండా ఉండేందుకు ఇదే మార్గమని గుర్తించాలి. ఈ సమయంలో ఏర్పడే భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవాలి. ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా, ఈ వ్యాధిని దరి చేరకుండా చూస్తాననే నమ్మకం ముఖ్యం. ఒక దినచర్యకు కట్టుబడి ఉండాలి. నిద్రించే సమయం, మేల్కొనే వేళలు, స్వీయ రక్షణ నిబంధనలు ఆచరించాలి. రోజూ వ్యాయామానికి ప్రాధాన్యమివ్వాలి. బ్రీతింగ్ ఎక్సర్ సైజ్లు, వాకింగ్, మానసికంగా చురుగ్గా, దృఢంగా ఉండేలా చేస్తాయి. రోజూ కనీసం అరగంట స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించాలి. ఒంటరితనం అనే భావన కలిగితే సామాజిక మాధ్యమాల ద్వారా స్నేహితులతో మాట్లాడితే సరిపోతుంది.