హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీఎల్) ఆదాయం గడిచిన ఏడేండ్లలో భారీగా పెరిగింది. రాష్ట్రం ఏర్పడేనాటికి 2014-15లో టీఎస్ఎండీసీఎల్ ఆదాయం రూ.19.12 కోట్లు ఉండగా ప్రస్తుత వార్షిక ఆదాయం రూ.800 కోట్లకు పెరగడం విశేషం. గత ఏడేండ్లలో టీఎస్ఎండీసీఎల్ రూ.4,002 కోట్లు ఆర్జించింది. ప్రభుత్వ పారదర్శక విధానాలతో అక్రమాలకు, బ్లాక్ మార్కెటింగ్కు తెరపడింది. ఉమ్మడి రాష్ట్రంలో నియంత్రణ లేక.. టన్ను ఇసుక ధర రూ.3,500 నుంచి 4000 దాకా ఉండేది. రాష్ట్రంలో ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టి, నిఘా వేయడంతో పరిస్థితి మారిపోయింది. గతంలో విజయవాడ నుంచి ఇసుకను తరలించేవారు. ఇప్పుడు స్వరాష్ట్రంలోనే ఇసుక రీచ్లను అభివృద్ధి చేయడంతో కొరత తీరింది. ఆన్లైన్లో బుక్ చేసుకొంటే టన్ను రూ.600కే లభిస్తున్నది. రవాణా ఖర్చులతో కలిపి మార్కెట్లో రూ.1300లకు దొరుకుతున్నది.
ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 18, ములుగులో 17, నిజామాబాద్లో 2 చొప్పున మొత్తం 37 రీచ్ల నుంచి ఇసుక సరఫరా అవుతున్నది. వానకాలంలో నదిలో నీరు అధికంగా ఉండటం, రీచ్వద్ద లారీలు దిగబడటం వంటి కారణాలతో ఇసుక వెలికితీతలో ఇబ్బంది ఎదురవుతున్నది. దీంతో టీఎస్ఎండీసీఎల్ వేసవిలోనే రోజుకు 50వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను స్టాక్యార్డుల్లో నిల్వ చేస్తున్నది. వివిధ నిర్మాణపనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు, బిల్డర్లను ఇసుక నిల్వ చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే వారికి సరఫరా ప్రారంభించింది. తాజాగా అనుమతులు పొందిన నిర్మాణాలను దృష్టిలో పెట్టుకొని మరో 60 రీచ్లను అందుబాటులోకి తేనున్నట్టు అధికారులు తెలిపారు. ములుగు జిల్లాలో 44, భద్రాద్రి కొత్తగూడెంలో 11, నిజామాబాద్లో 5 రీచ్లను ఏర్పాటుచేస్తున్నారు. కొన్నిచోట్ల ఇప్పటికే పబ్లిక్ హియరింగ్ పూర్తికాగా, మరికొన్నిచోట్ల ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతున్నది.
ఇసుక విక్రయాలు, ఆదాయం వివరాలు
సంవత్సరం పరిమాణం ఆదాయం
(క్యూబిక్ మీటర్లు) (రూ. కోట్లలో)
2014-15 1,82,540 19.12
2015-16 65,93,574 374.99
2016-17 69,45,680 456.46
2017-18 1,08,94,778 678.35
2018-19 1,38,92.323 886.43
2019-20 1,24,32,847 792.80
2020-21 1,21,19,081 794.00
మొత్తం 6,30,60,823 4,002.15