సమైక్య రాష్ట్రంలో అరిగోస పడ్డ రైతులు
గుక్కెడు నీళ్ల కోసం ఎంతో దూరం వెళ్లేవారు
వందలాది ఫీట్ల లోతు బోరు వేసినా కానరాని నీటిచుక్క
బీడు భూములకు నీళ్లను మళ్లించిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్
గోదావరి జలాల రాకతో రైతుల్లో నూతనోత్తేజం01
సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో మండుటెండల్లో పొంగి పొర్లుతున్న చెరువులు, చెక్డ్యాంలు
నిండుగా హల్దీ, కూడవెల్లి వాగులు
సంబుర పడుతున్న సబ్బండ వర్ణాలు
సిద్దిపేట, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మైక్య రాష్ట్రంలో నిధులు, నీళ్లు, నియామకాలే కాకుండా అన్నింటా తెలంగాణ వివక్షకు గురైంది. సాగునీరందక భూములు బీడుబారి రైతులు ఉపాధి కోల్పోయారు. సాగునీటికి రైతులు బోరుబావులు తవ్వించి ఆర్థికంగా చితికిపోయారు. కరెంట్ కష్టాలు ఏడిపించేవి. పాలకుల చేయూత లేక అప్పట్లో రైతులు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. అప్పటి పాలకుల తీరుతో రైతులను పరిస్థితులు కన్నీటిని పెట్టిస్తే, ఇప్పుడు మండుటెండల్లో గోదారమ్మ పరవళ్లు తొక్కుతుంటే రైతులు మురిసిపోతున్నారు. బిరబిరా గోదారమ్మ పరుగులెత్తుకుంటూ వచ్చి ఎండిపోతున్న పంటలకు జీవం పోస్తుంటే అన్నదాత ఆనందానికి గురవుతున్నాడు. సీఎం కేసీఆర్ కృషితో వందల కిలోమీటర్ల దూరం నుంచి గోదావరి జలాలు మండుటెం డల్లో మెదక్, సిద్దిపేట జిల్లాల్లో పారుతూ చెక్డ్యామ్లు, చెరువులను నింపుతూ జలానందానికి గురిచేస్తున్నాయి. ఇక మెతుకు సీమ సస్యశ్యామలం కానుంది. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఇప్పటి వరకు 20 చెక్డ్యాంలు, నాలుగు చెరువులు నిండాయి.
సమైక్య పాలనలో తెలంగాణపై అన్నివిధాలుగా వివక్ష చూపారు. కనీసం ఒక్క ప్రాజెక్టు నిర్మాణం చేయకపోవడమే గాక కనీసం తట్టెడు మట్టి ఎత్తిన పాపాన పోలేదు. నెర్రెలు బారిన, బీడు భూములు, ఎండిన చెరువులు, అడుగంటిన భూగర్భజలాలతో రైతులు అరిగోస పడ్డారు. పూర్తిగా బోరు బావులు, వర్షాధారంపై ఆధారపడి పంటలు సాగుచేసిన రైతులకు, చేతికందే సమయంలో ఏదో ఒక రూపంలో దిగుబడి ఆశించినంత రాకపోయేది. వచ్చిపోయే కరెంట్తో మోటార్లు కాలేవి. సాగు పెట్టుబడి అధికంగా ఉండేది..! నీళ్లకోసం వందల ఫీట్ల లోతుకు బోర్లు వేసినా చుక్కనీరు కానరాక పోయేది. ఒక్కో రైతు పదుల సంఖ్యలో బోర్లు వేసేవారు. చివరికి అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గ్రామాల్లో తాగేందుకు గుక్కెడు నీళ్లు లేక జనం నాయకుల చుట్టూ బోర్లు వేయించమని తిరిగేవాళ్లు.. తాగునీటి కోసం మైళ్ల దూరం వెళ్లి తెచ్చుకున్న సందర్భం.. ఇదంతా సమైక్య పాలనలో మన రైతులు, జనం పడ్డ కష్టాలు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమ నేత కేసీఆర్ సీఎం కావడంతో రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారు. గలగల పారేటి గోదావరి నీళ్లను బీడు భూములకు మళ్లించారు. నీటి పారుదల రంగానికి భారీ స్థాయిలో నిధులు కేటాయించి పెద్దఎత్తున ప్రాజెక్టులు నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో వందలాది చెరువులు, చెక్డ్యామ్లు నింపుకుంటున్నాం. సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ, రంగనాయక రిజర్వాయర్లతో పాటు ఎక్కడో పుట్టిన గోదావరి గంగమ్మను 618 మీటర్ల ఎత్తులో ఉన్న సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ రిజర్వాయర్లోకి తీసుకువచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మెతుకు సీమలో గోదావరి జలాలు పారుతున్నాయి. ఉత్తర తెలంగాణ వరప్రదాయినీ మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జూన్లో నీటిని విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధ్దం చేశారు.
సమైక్య రాష్ట్రంలో నీళ్ల కోసం అరిగోస పడ్డ రైతులు…
సమైక్య రాష్ట్రంలో రైతులకు అన్నీ కష్టాలె.. పంట చేతికొచ్చే వరకు రైతుకు ఆశలు ఉండేవి కావు. బోరుబావులు, వర్షాధారంపై ఆధారపడి సాగుచేసేవారు. వచ్చిపోయే కరెంట్, కాలిపోయే మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లతో రైతుకు పెట్టుబడి తడిసిమోపెడయ్యేది. పంట చేతికందే సమయానికి నీరందక బోరుబావులను తవ్వేవారు. ఒక్కో రైతు 500 ఫీట్లకు పైగా బోరు తవ్వించినా చుక్కనీరు రాకపోవడంతో అప్పులపాలయ్యే వారు. ఇవన్నింటిని ఆలోచించి రైతు తనలో తాను కుమిలిపోయి ఆత్మహత్యలకు పాల్పడేవారు. గత ప్రభుత్వాల హయాంలో సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో రైతు ఆత్మహత్యలు అధికంగా ఉండేవి. ప్రతి రైతు ఆత్మహత్య వెనుక ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఉండేవి. బోర్లు వేసి బొక్కబోర్లా పడేవారు. సమైక్య రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదు. సాగునీటి కోసం ఒక ప్రాజెక్టు కట్టాలన్న ఆలోచన కూడా వారికి రాకపోవడంతో తెలంగాణ రైతు ఆర్థికంగా దెబ్బతిన్నాడు. రైతుకు సాగునీరు అందించినప్పుడే ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడుతుంది. కానీ, ఆనాటి పాలకులు ఎవరూ ఆ దిశగా ఆలోచించలేకపోయారు.
గోదావరి జలాలతో రైతుల్లో నూతనోత్తేజం..
ఈ నీళ్లు వస్తాయా.. మేం చూస్తామా అనుకున్నాం.. మా కళ్ల ముందటనే గోదావరి నీళ్లు చూస్తుంటే ఇంతకన్నా మాకేం కావాలి.. అంటూ రైతాంగం ఇవాళ సంబుర పడుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతుల్లో నూతనోత్తేజం వచ్చింది. సాగునీరు లేక రైతులు ఇన్నాళ్లు అల్లాడిపోయారు. ఎక్కడో పుట్టిన గోదారమ్మను సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ మీదుగా ఎంతో ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సాగర్ వరకు నీళ్లు తీసుకువచ్చిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్. ఈ మండుటెండల్లో రంగనాయకసాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో పారుతూ చెరువులు, చెక్డ్యామ్లను నింపుతున్నాయి. ప్రస్తుతం హల్దీవాగులో పారుతున్న గోదావరి జలాలు, మూడు రోజుల్లో మంజీరా నదిని చేరే అవకాశం ఉంది. వారం రోజుల్లో కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టును గోదావ రి జలాలు చేరనున్నాయి. రైతు సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ రైతులకు దేవుడంటున్నారు. ఇన్నాళ్లు రైతుల కోసం ఎవ రూ ఆలోచించలేదు. రైతుబంధు, రైతుబీమా తదితర పథకాలను ప్రవేశపెట్టి రైతాంగానికి దన్నుగా నిలిచారు.
అన్నపూర్ణ, రంగనాయకసాగర్, కొండపోచమ్మకు గోదావరి జలాలు వస్తుండడంతో కాల్వ ల ద్వారా చెరువులు,కుంటలు,చెక్డ్యాంలు నిండి వాటి పరీవాహక ప్రాంతాల్లో వందల ఎకరాల్లో సాగు విస్త్తీ ర్ణం పెరిగింది. సిద్దిపేట జిల్లాలో ఈసారి యాసంగి సాగు 2.83 లక్షల ఎకరాలు సాగైంది. ఈసారి గణనీయంగా వరి సాగు విస్తీర్ణం పెరిగింది. గోదావరి జలా లు రావడమే ఇందుకు కారణం అని చెప్పవచ్చు. గతేడాది, ప్రస్తుత యాసంగి సాగు లెక్కలను పరిశీలిస్తే సుమారుగా 1.50 లక్షల ఎకరాల సాగు పెరిగింది. మెదక్ జిల్లాలోనూ వరిసాగు గణనీయంగా పెరిగింది. ప్రస్తుత యాసంగిలో పంటలు ఎండిపోకుండా సాధ్యమైనంత మేరకు చెరువులను, కుంటలను, చెక్డ్యాంలను నెల రోజుల నుంచి గోదావరి జలాలతో ప్రభుత్వం నింపుతున్నది. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక మీదుగా వెళ్లే కూడవెల్లి వాగును నింపడంతో మండుటెండల్లో సైతం వాగుపైన ఉన్న 39 చెక్డ్యాం లు పొంగి పొర్లుతున్నాయి. వాగు పరీవాహక ప్రాంతం పచ్చని పంటలతో కనిపిస్తున్నది. గోదావరి జలాలు చూసి రైతులు సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. మళ్లీ జిల్లాలో పాత రోజులు వచ్చాయి. వృద్ధులు తమ పాత రోజులను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రధాన బావుల్లో కొట్టిన నాటి ఈతలు ..ఇవ్వాళ గోదావరి జలాలు చూస్తే ఎంతో సంబురం అవుతుందంటున్నారు.
ఇవి కూడా చదవండి
వకీల్ సాబ్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే..
కరోనా ఎఫెక్ట్ : ఆచార్య సినిమా రిలీజ్ వాయిదా ..?
ఇట్స్ ఆఫీషియల్.. కొరటాల శివతో మరోసారి ఎన్టీఆర్
916 కేడీఎం గోల్డ్ దోశ.. రేటెంతో తెలుసా?