ఇష్టారాజ్యంగా భారీ భవనాల నిర్మాణం
హెచ్ఎండీఏ అనుమతి తీసుకోకుండానే..
జీ+2 పర్మిషన్.. బహుళ అంతస్తుల్లో నిర్మాణం
సర్కారు ఆదాయానికి గండికొడుతున్న బిల్డర్లు
పటాన్చెరు, ఏప్రిల్ 17: ఇంద్రేశం, కిష్టారెడ్డిపేట సర్పంచ్, ఉప సర్పంచ్లకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో ఆయా గ్రామాల్లో అక్రమ నిర్మాణాలు నిలిచిపోయాయి. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఆయా పంచాయతీల్లో అక్రమ భవనాల కూల్చివేత కొనసాగుతున్నది. నిబంధన ప్రకారం జీ ప్లస్ రెండంతస్తులు మాత్రమే నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా, బిల్డర్లు, భవన యజమానులు ఐదంతస్తులు నిర్మిస్తున్నారు. జీ ప్లస్ టు ఆపైన నిర్మాణాలకు హెచ్ఎండీఏ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాగా, సర్పంచులు, పాలకమండళ్లు భారీ భవనాలకు అక్రమంగా అనుమతినిస్తున్నారు. మాజీ సర్పంచ్లు, సస్పెండ్ అయిన ఈవోలతో పాత తేదీలపై సంతకాలు చేసి అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రాపురం మండలాల్లో హెచ్ఎండీఏకు సంబంధం లేకుండా అనేక భారీ అపార్టుమెంట్లు కడుతున్నారు. జీ ప్లస్ టు పేరున మాత్రమే ట్యాక్స్ చెల్లిస్తుండగా, మిగిలిన అంతస్తులకు ఇటు పంచాయతీలకు కానీ అటు హెచ్ఎండీఏకు కానీ ఎలాంటి పన్నులు చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతున్నది.
పాత తేదీలతో…
పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్ఫూర్, పటాన్చెరు, రామచంద్రాపురం, జిన్నారం మండలాల్లో భారీ భవనాలు, అపార్ట్మెంట్ల నిర్మాణం జరుగుతున్నాయి. నిబంధనల మేరకు హెచ్ఎండీఏ నుంచి అనుమతి తీసుకోవాలి. ప్రతి భవనానికి ట్రాన్స్ఫార్మర్ స్థలంతో పాటు ఫైరింజన్ తిరిగే స్థాయిలో చుట్టూ ఖాళీ స్థలం వదలాలి. పార్కింగ్ చూపించాలి. సెట్ బ్యాంక్ ఉండాలి. ఇవన్నీ లేకుండా గజం జాగా కూడా వృథా కాకుండా భవనాలను నిర్మిస్తున్నారు. స్థానికంగా ఉన్న పంచాయతీ పాలకమండలి, కార్యదర్శులు జీ ప్లస్ టు పర్మిషన్ అని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు. తాము అధికారంలో ఉన్న సమయంలో పర్మిషన్లు ఇవ్వలేదని చూపించేందుకు తాజా పాలకమండళ్లు, మాజీ సర్పంచ్లు, సస్పెండ్, రిటైర్ అయిన కార్యదర్శులతో పాత తేదీలతో సంతకాలు చేసి అనుమతి పత్రాలు సృష్టిస్తున్నారు. అమీన్పూర్ పంచాయతీగా ఉన్నప్పుడు ఈ విధంగా వందల అపార్ట్మెంట్లు నిర్మించారు. అప్పుడు కూడా అనేకమంది కార్యదర్శులు సస్పెండ్ అవగా, మాజీ సర్పంచ్లు అక్రమ సంతకాలతో పట్టుబడి కేసులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాతనే పాత సర్పంచ్లు, మాజీ కార్యదర్శులు పాత తేదీలతో పర్మిషన్లు ఇవ్వడానికి సంతకాలు పెడుతున్నారు. పాత తేదీలకు సంబంధించి ఎలాంటి దస్తావేజులు పంచాయతీల్లో ఉండవు. కేవలం బిల్డర్ వద్ద మాత్రమే నకిలీ అనుమతి పత్రాలు ఉంటాయి. వాటిని చూపే బిల్డర్లు ఫ్లాట్లు నిర్మించి విక్రయిస్తున్నారు. కిష్టారెడ్డిపేట, ఇంద్రేశంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లకు ఇప్పటికే సంగారెడ్డి కలెక్టర్ రెండోసారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ముత్తంగి, పటేల్గూడ, ఇస్నాపూర్, చిట్కుల్, రుద్రారం, కర్ధనూర్, భానూర్, పాటీ, కాజీపల్లి, సుల్తాన్పూర్, నాగులపల్లి, ఉస్మాన్నగర్, కొల్లూర్, వెలిమెలలో భారీ భవనాలు వెలుస్తున్నాయి. కొన్ని మేజర్ పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారినా అక్రమలపై చర్యలు మాత్రం లేవు.
కిష్టారెడ్డిపేట్లో కొనసాగుతున్న కూల్చివేతలు
అమీన్పూర్ : మండల పరిధిలోని కిష్టారెడ్డిపేట్ పంచాయతీలో రెండోరోజూ శనివారం అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. సంగారెడ్డి డీఎల్పీవో సతీశ్రెడ్డి అధ్వర్యంలో 14 అక్రమ నిర్మాణాల్లో 6 బహళ అంతస్తుల్లో రెండు ఫ్ల్లోర్లు మినహాయించి, పైన అంతస్తుల్లో ఇప్పటికే స్లాబ్లకు గుంతలు చేశారు. కాగా, శనివారం మిగతా భవనాలకూ గ్యాస్ కట్టర్ల ద్వారా స్లాబ్లను తొలగించారు. ఇదే ప్రాంతంలో మరో 21 నిర్మాణాలను గుర్తించినట్లు డీఎల్పీవో సతీశ్రెడ్డి తెలిపారు. కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల మేరకు అక్రమ వెంచర్లు, భవనాల నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి
మరో రికార్డుకు చేరువలో టీసీఎస్! అదేంటంటే?!
డేవిడ్ వార్నర్ రనౌట్..ఒత్తిడిలో రైజర్స్