మంగళూరు, సెప్టెంబర్ 13: కాంగ్రెస్ కురువృద్ధుడు, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ (80) సోమవారం కన్నుమూశారు. రెండు నెలల కిందట ఇంట్లో వ్యాయామం చేస్తుండగా ఒక్కసారిగా కిందపడిపోయారు. గాయాలైన ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ సోమవారం మధ్యాహ్నం మంగళూరులోని ఓ ప్రైవేటు దవాఖానలో తుదిశ్వాస విడిచారు. ఫెర్నాండెజ్ మృతిపై ప్రధాని మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ సంతాపం తెలిపారు. ఐదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఫెర్నాండెజ్ ఎన్నో పదవులను చేపట్టారు. కర్ణాటకలోని ఉడుపి నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచారు. తర్వాత నాలుగుసార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. కేంద్రమంత్రిగా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.
తీరని లోటు: కేసీఆర్
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఫెర్నాండెజ్ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. తొలి యూపీఏ క్యాబినెట్లో ఆయనతో కలిసి పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. దేశం కోసం ఫెర్నాండెజ్ చేసిన సేవలు గొప్పవని, ఆయన మరణం తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫెర్నాండెజ్ మృతి బడుగు, బలహీన వర్గాలు, క్రిస్టియన్ సమాజానికి తీరనిలోటని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తాను, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలుసార్లు ఫెర్నాండెజ్ను కలిశామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ గుర్తుచేసుకున్నారు.