న్యూఢిల్లీ: సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం 19 ప్రతిపక్ష పార్టీల చీఫ్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ మేరకు నిర్ణయించారు. మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, భీమా కోరెగావ్ కేసు, సీఏఏ వ్యతిరేక నిరసనల్లో అరెస్ట్ చేసిన వారితోపాటు జమ్ముకశ్మీర్లోని రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. కేంద్ర సేవల కేడర్తోపాటు జమ్ముకశ్మీర్ పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని, స్వేచ్ఛగా ఎన్నికలను త్వరగా నిర్వహించాలని కేంద్రాన్ని కోరాయి.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలను కేంద్రం అడ్డుకున్న తీరును, సభలో మహిళా ఎంపీలపై దాడి, పెగాసస్ స్పైవేర్ చట్టవిరుద్ధ వినియోగానికి సమాధానం ఇవ్వకపోవడాన్ని, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయకపోవడం, కరోనా నియంత్రణలో వైఫల్యం, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలను కేంద్ర ప్రభుత్వం అదుపుచేయకపోవడాన్ని తాము ఖండిస్తున్నట్లు ప్రతిపక్ష పార్టీలు పేర్కొన్నాయి.