న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వమే వ్యాక్సిన్లను సమీకరించి రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కాషాయ పార్టీ నేతలు స్వాగతించగా సుప్రీంకోర్టు మందలించడంతోనే ఆలస్యంగా ఈ ప్రకటన చేశారని విపక్షాలు దుయ్యబట్టాయి. ఉచిత వ్యాక్సినేషన్ పై సర్వోన్నత న్యాయస్ధానం ఉత్తర్వులతోనే ప్రధాని స్పందించారని, ఈ నిర్ణయం ప్రకటించేందుకు ఇంత సమయం ఎందుకు తీసుకున్నారని విపక్షాలు ప్రశ్నించాయి.
వ్యాక్సిన్ సరఫరాల్లో తీవ్ర జాప్యం ద్వారా దేశానికి మీరు చేసిన గాయం పూడ్చలేనిదని కాంగ్రెస్ పేర్కొంది. ఉచిత వ్యాక్సినేషన్ తో పాటు కేంద్రమే వ్యాక్సిన్లను సేకరించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేసిన అనంతరం ప్రధాని మోదీ దిగివచ్చారని ఆ పార్టీ వ్యాఖ్యానించింది. వ్యాక్సిన్ల సమీకరణ బాధ్యతను కేంద్రమే చేపట్టాలని, 18-44 ఏండ్ల వయసు వారికి ఉచిత వ్యాక్సిన్ అందించాలన్న ప్రతిపక్షాల డిమాండ్ ను ఆమోదించేందుకు ప్రజలపై పెను భారం మోపే వరకూ సమయం తీసుకున్నారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు.
సుప్రీం కోర్టు ఉత్తర్వులకు తలొగ్గి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని, జాతీయ వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని తాము డిమాండ్ చేశామని ఆప్ పేర్కొంది. సుప్రీం కోర్టు మందలింపుతో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేలుకొందని ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా వ్యాఖ్యానించారు.