కొలంబో: గతవారం కొలంబో తీరంలో అగ్నిప్రమాదానికి గురైన సింగపూర్ ఓడ మునిగిపోతున్నదని, దానివల్ల సముద్రంలోకి ఒలికే చమురు సమస్యను ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని శ్రీలంక సముద్ర పర్యావరణ రక్షణ ప్రాధికార సంస్థ గురువారం ప్రకటించింది. సముద్ర పర్యావరణానికి జరిగిన నష్టంపై సంబంధింత పక్షాలపై పరిహారానికి దావా వేస్తామని సంస్థ అధికారి టర్నీ ప్రదీప్కుమార తెలిపారు. ఓడ సిబ్బందిని ప్రశ్నిస్తామని, వారి వాంగ్మూలాన్ని రికార్డు చేస్తామని వివరించారు. అటార్నీ జనరల్ ద్వారా చట్టపరమైన చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. గత మంగళవారం ఎంవీ ఎక్స్ప్రెస్ పెరల్ ఓడ నుంచి అగ్నిప్రమాద సంకేతాలు అందుకున్న తర్వాత భారత్, ఫిలిప్పీన్స్, చైనా, రష్యా దేశాలకు చెందిన 25 మంది సిబ్బందిని కాపాడారు. ఓడ నుంచి సముద్రంలోకి ఒలికిన చమురును సేకరించేందుకు ఏర్పాట్లు జరిగాయని, అవసరమైన సాధనసంపత్తిని సిద్ధంగా ఉంచామని ప్రదీప్ కుమార తెలిపారు. కొలంబో నుంచి మరవల వరకు పశ్చిమ తీరంలో కనిపిస్తున్న చమురు తాలూకు నమూనాలు సేకరించి విశ్లేషిస్తున్నారు. పర్యావరణ నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఓడ ట్ఆంకుల్లో 325 మెట్రిక్ టన్నుల ఇంధనం ఉంది. అది కాక ఓడపై 1,486 కంటేనర్లలో ప్రమాదకరమైన నైట్రిక్ యాసిడ్ ఉంది. గుజరాత్ లోని హజీరా రేవు నుంచి కొలంబోకు వాటిని తరలిస్తున్నారు. మంగళవారం సహాయం కోసం సంకేతాలు అందడంతో భారత తీర రక్షక దళం నౌకలు అండగా వెళ్లాయి. యూరోపియన్ యూనియన్ కు చెందిన నౌకలు సైతం సాయం చేసేందుకు వచ్చాయి. కానీ ప్రతికూల వాతావరణం, సముద్రపు పోటు కారణంగా వారి ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు.