న్యూఢిల్లీ : పార్లమెంట్లో పెగాసస్ వివాదం సహా పలు అంశాలపై చర్చించేందుకు మోదీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుండటంతో ప్రతిష్టంభన నెలకొందని విపక్షాలు బుధవారం ఆరోపించాయి. పెగాసస్ వ్యవహారంపై చర్చ చేపట్టి హోంమంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలన్న డిమాండ్కు కట్టుబడి ఉన్నామని విపక్షాలు సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. పెగాసస్ వ్యవహారంతో పాటు వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై కూడా చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టాయి.
పార్లమెంట్ కార్యకలాపాలను విపక్షాలు స్తంభింపచేస్తున్నాయని మోదీ సర్కార్ దుష్ప్రచారం సాగిస్తోందని భగ్గుమన్నాయి. జాతీయ భద్రతకు సంబంధించిన పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై పార్లమెంట్ ఉభయసభల్లో చర్చ జరిపి హోంమంత్రి సమాధానం చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. రైతుల సమస్యలు, వివాదాస్పద సాగు చట్టాల పైనా పార్లమెంట్లో చర్చ జరగాలని స్పష్టం చేశాయి. విపక్షాల సంయుక్త ప్రకటనపై కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జన్ ఖర్గే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, డీఎంకే నేత టీఆర్ బాలు, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సహా పలు పార్టీలకు చెందిన విపక్ష నేతలు సంతకాలు చేశారు.