న్యూఢిల్లీ: రాజ్యసభ చైర్మన్ ( Rajya Sabha Chairman ) వెంకయ్యనాయుడి ( Venkaiah Naidu ) పై అవిశ్వాస తీర్మానం ( No Confidence Motion ) ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. సభా కార్యక్రమాల నిర్వహణలో వెంకయ్య విఫలమైనట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అందుకే వచ్చే వారం ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన నాటి నుంచి సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. పెగాసస్ వ్యవహారం, సాగు చట్టాల రద్దు లాంటి అంశాలపై చర్చ చేపట్టాలని విపక్షాలు ప్రతి రోజూ వాయిదా తీర్మానాలు ఇస్తూనే ఉన్నాయి. అయితే ఆ తీర్మానాలను వెంకయ్య తిరస్కరిస్తున్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంటున్నది. సభా కార్యక్రమాలకు విపక్షాలు అడ్డుపడడంతో.. సభలను వాయిదా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో విపక్షాలు వెంకయ్యపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు రెండు వారాల సాగిన తాజా సమావేశాల్లో రాజ్యసభలో మొత్తం 50 గంటలకు గాను 40 గంటలు వృధాగా పోయినట్లు హౌజ్ సెక్రటరీ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. రాజ్యసభలో కేవలం 1.24 గంటలు మాత్రమే సభా కొన్ని కార్యక్రమాలను నిర్వహించింది. దాంట్లో నాలుగు బిల్లులను పాస్ చేశారు. తొలి వారంలో 32.2 శాతం, రెండవ వారంలో 13.7 శాతం సభను విపక్షాలు అడ్డుకున్నాయి.