లాహోర్: పాకిస్థాన్లోని లాహోర్లో పేలుడు ఘటన సంభవించింది. ఆ ఘటనలో ఇద్దరు మృతిచెందారు, 17 మంది గాయపడ్డారు. ఓ రెసిడెన్షియల్ ప్రాంతంలో ఈ పేలుడు జరిగింది. దాంతో సమీపంలో ఉన్న ఇండ్లు ధ్వంసం అయ్యాయి. పేలుడు వల్ల గాయపడ్డవారిలో పోలీసు అధికారి ఉన్నట్లు లాహోర్ డిప్యూటీ కమీషనర్ ముదాసిర్ రియాజ్ మాలిక్ తెలిపారు. పేలుడుకు కారణాలు ఏంటో ఇంకా తెలియలేదన్నారు. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. గ్యాస్ పైప్లైన్ లేదా సిలిండర్ పేలి ఉంటుందా అన్న కోణంలో విచారణ సాగే అవకాశాలు ఉన్నాయి. గాయపడ్డవారిని జిన్నా హాస్పిటల్కు తరలించారు. పేలుడు ఘటన పట్ల విచారణ చేపట్టాలని ఐజీకి పంజాబ్ సీఎం ఉస్మాన్ బుజ్దార్ ఆదేశించారు.
పేలుడు జరిగిన ప్రాంతంలోనే లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఇల్లు ఉన్నది. అయితే ప్రస్తుతం హఫీజ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. జోహార్ టౌన్లోని పేలుడు జరిగిన ప్రాంతం హఫీజ్ ఇంటికి 120 మీటర్ల దూరం ఉంది. టెర్రర్ ఫండింగ్ కేసులో హఫీజ్ అరెస్టు అయిన విషయం తెలిసిందే. పేలుడు బాంబు ఘటనలా ఉన్నట్లు లాహోర్ పోలీసు చీఫ్ గులామ్ తెలిపారు.