గువాహటి : పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి త్రిపుర రాజ వంశీయుడు ప్రద్యోత్ మాణిక్య దేబర్మన్ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీని ఎదుర్కోవడానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి సిద్ధమని ప్రకటించారు. మంగళవారం గువాహటిలో అసోం జాతీయ పరిషత్ (ఏజేపీ)తో ది ఇండోజినియస్ ప్రోగ్రెసివ్ రీజనల్ అలయెన్స్ (టిప్రా) అధినేత ప్రద్యోత్ మాణిక్య దేబర్మన్ జత కట్టారు. ఈ సందర్భంగా ప్రద్యోత్ మాణిక్య దేబర్మన్ మాట్లాడుతూ.. 2023లో త్రిపురలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయడానికి సిద్ధం అని తెలిపారు.
ఏజేపీ అధ్యక్షుడు లురింజ్యోతి గొగోయ్ మాట్లాడుతూ, ఈశాన్య రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతీయ పార్టీలతో త్వరలో చర్చలు జరిపిన తర్వాత కూటమి ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రాంతీయ రాజకీయ కార్యాచరణను బలోపేతం చేయడమే తమ కూటమి లక్ష్యమని చెప్పారు.
2016లో బీజేపీ సారధ్యంలో నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్ఈడీఏ) ఏర్పాటైంది. దీని తర్వాతే ఈశాన్య ప్రాంతంలో ఎనిమిది రాష్ట్రాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలోకి వచ్చాయి. ప్రద్యోత్ మాణిక్య దేబర్మన్ స్పందిస్తూ.. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలుపొందడానికి మాత్రమే ఏర్పాటైన కూటమి ఎన్ఈడీఏ అని పేర్కొన్నారు.
మొత్తం ఈశాన్య ప్రాంతాన్ని ఇప్పుడు ఒకే ఒక్క పార్టీ బీజేపీ, దాని మిత్ర పక్షాలు పాలిస్తున్నాయని ప్రద్యోత్ మాణిక్య దేబర్మన్ గుర్తు చేశారు. కానీ బీజేపీ మిత్ర పక్షాలు సంతృప్తిగా లేవని చెప్పారు. దీనికి అసోం, మేఘాలయ మధ్య జరిగిన పరిణామాలే నిదర్శనం అని అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి :
Back pain | సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఎక్కువగా వేధిస్తున్న ఈ సమస్యను ఎలా జయించాలి?
Mirnalini Ravi | అందాలతో అదరగొడుతున్న మృణాళిని రవి
హెల్త్ ఇన్సూరెన్స్ క్లైయిమ్ రిజెక్ట్ అయితే ఏం చేయాలి ? ఎవరిని సంప్రదించాలి
గుడ్డి నిర్ణయాలొద్దు.. నీట్ను వాయిదా వేయండి..!