తిరువనంతపురం, జూన్ 20: కేరళ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజకు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. కరోనా విపత్తు సమయంలో ఆమె చేసిన సేవలకు గాను సెంట్రల్ యూరోపియన్ యూనివర్సిటీ (సీఈయూ) ఓపెన్ సొసైటీ ప్రైజ్-2021కు శైలజ ఎంపికయ్యారు. సీఈయూ 30వ గ్రాడ్యుయేషన్ వేడుకల సందర్భంగా ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు సీఈయూ అధ్యక్షుడు మైకేల్ ఇగ్నాటీఫ్ తెలిపారు. కరోనా సందర్భంగా శైలజతో పాటు వైద్య సిబ్బంది ప్రజలకు విశేష సేవలందించారని ఆయన కొనియాడారు. అంతేగాక ప్రజాజీవితంలో అడుగుపెట్టాలనుకునే యువతులకు శైలజా టీచర్ ఆదర్శంగా నిలిచారని తెలిపారు.