న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan ) తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంపై ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న ఆ దేశస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి దేశాన్ని చేజిక్కించుకున్న తర్వాత శాంతి వచనాలు పలుకుతున్నా.. వాళ్లను ఎవరూ నమ్మడం లేదు. ఇటు ఇండియాలోని ఆఫ్ఘన్లు కూడా తమ దేశ పరిస్థితిపై ఆందోళనగా ఉన్నారు. ఏది ఏమైనా తాము తిరిగి స్వదేశానికి వెళ్లబోమని, ఇండియాలోనే ఉంటామని వాళ్లు చెబుతున్నారు. ప్రముఖ న్యూస్ నెట్వర్క్ ఇండియా టుడే కోల్కతాలోని ఆఫ్ఘన్లతో దీనిపై మాట్లాడే ప్రయత్నం చేసింది. వాళ్లంతా ముక్తకంఠంతో చెబుతున్నది ఒక్కటే.. చాన్నాళ్లుగా మిత్రదేశంగా ఉన్న ఇండియానే తమ దేశాన్ని కాపాడాలని, ఆ దిశగా మోదీ ప్రయత్నం చేయాలని కోరుతున్నారు.
జైల్లో వేసినా సరే..
పాకిస్థాన్, చైనా, సౌదీ అరేబియాలాంటి దేశాలపై తమకు నమ్మకం లేదని, ఇండియా చాలా రోజులుగా తమ దేశానికి స్నేహంగా ఉన్నదని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మోదీ తమకు సాయం చేయగలరని కోల్కతాలో సెటిలైన జహీర్ఖాన్ అనే ఆఫ్ఘన్ అన్నాడు. 25 ఏళ్ల కిందట వీళ్లు ఇండియా వచ్చి స్థిరపడ్డారు. ఈ దేశంలో దేనికైనా నేను సిద్ధం. జైల్లో వేసినా సరే. కానీ తాలిబన్ చేతుల్లో ఉన్న ఆప్ఘనిస్థాన్కు మాత్రం వెళ్లను అని జహీర్ స్పష్టం చేస్తున్నాడు.
పాకిస్థాన్ను నమ్మం..
కోల్కతాలోని చాలా వరకూ కాబూలీవాలాలు ప్రస్తుతం టేలరింగ్ లేదా బట్టల షాపుల బిజినెస్ చేస్తున్నారు. తాలిబన్లకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతివ్వడంపై ఇబ్రహీం ఖాన్ అనే మరో వ్యక్తి స్పందించాడు. ఏ ఆఫ్ఘన్నైనా అడగండి. వాళ్లు పాకిస్థాన్ నుంచి ఏమీ వద్దు అని చెబుతారు. మమ్మల్ని బానిసలమని ఇమ్రాన్ అంటున్నారు. నిజానికి వాళ్లే ఇతరుల బానిసలు. పాకిస్థాన్ మా నంబర్ వన్ శత్రువు. వాళ్ల నుంచి మాకేమీ వద్దు అని ఇబ్రహీం అంటున్నాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మా దేశానికి సాయం చేయాలి. అక్కడి వాళ్లను తరలించడానికి సాధ్యమైనన్ని ఎక్కువ విమానాలను పంపించాలి అని అతడు కోరుతున్నాడు.
ఇది పాకిస్థాన్ పనే..
ఇక ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ముని మనవరాలు యాస్మిన్ నిగర్ ఖాన్ కూడా ఈ సంక్షోభంపై స్పందించారు. ఇండియా ఓ సూపర్ పవర్ అని, ఆప్ఘనిస్థాన్ ఈ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం సాయం చేయాలని ఆమె కోరారు. మంచి తాలిబన్లు, చెడు తాలిబన్లు అంటూ ఉండరు. అందరూ ఒక్కటే. అయితే ఆఫ్ఘన్ తాలిబన్లు, పాక్ తాలిబన్లు మాత్రం ఉన్నారు. ఆఫ్ఘన్లోని 90 శాతం తాలిబన్లు అష్రఫ్ ఘనీకి మద్దతు తెలిపారు. మిగిలిన 10 శాతం మందికీ పాకిస్థాన్ బ్రెయిన్వాష్ చేసి ఇలా దాడి చేయించింది అని ఆమె అన్నారు. ఆఫ్ఘన్లకు సాయం చేయాలని ఆమె మోదీని కోరారు.