ముస్సోరీ: ఉత్తరాఖండ్లోని కెంప్టీ జలపాతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. ముస్సోరీలో ఉన్న ఆ వాటర్ఫాల్స్ వద్ద సేదతీరేందుకు జనం భారీ సంఖ్యలో వెళ్తున్నారు. వందల సంఖ్యలో జనం అక్కడ ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి ఇటీవల వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది. మాస్క్లు ధరించకుండా, సోషల్ డిస్టాన్స్ పాటించకుండా.. ఒకే చోట పెద్ద ఎత్తున జనం గుమ్మిగూడడం వల్ల మళ్లీ కరోనా విజృంభించే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం కొత్త ఆదేశాలు జారీ చేసింది. కెంప్టీ జలపాతం వద్ద 50 మంది కన్నా ఎక్కువ సంఖ్యలో ఒకేసారి టూరిస్టులు ఉండకూడదని ఆదేశించింది. ఆ వాటర్ఫాల్స్కు వచ్చిన వాళ్లు అరగంట కన్నా ఎక్కువ సమయం గడపవద్దు అని కూడా పేర్కొన్నది. టూరిస్టుల తాకిడిని మానిటర్ చేసేందుకు ఓ చెక్ పోస్టును ఏర్పాటు చేసినట్లు తెహ్రీ ఘర్వాల్ జిల్లా మెజిస్ట్రేట్ ఇవా ఆశిష్ శ్రీవాత్సవ్ తెలిపారు.