సుల్తాన్బజార్, మే 17: కొవిడ్ వ్యాధి పూర్తి స్థాయిలో తగ్గిపోయి బ్లాక్ ఫంగస్తో బాధపడుతున్న రోగులకు మాత్రమే తమ వద్ద వైద్య సేవలు అందిస్తున్నామని ప్రభుత్వ ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ టి.శంకర్ స్పష్టం చేశారు. కోఠిలోని ప్రభుత్వ ఈఎన్టీ దవాఖానను బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్సలకు నోడల్ కేంద్రంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, సోమవారం జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసులు, ఏఎంఓహెచ్ ఉమాగౌరి ఇతర అధికారులతో కలిసి ఈఎన్టీ దవాఖానను సందర్శించారు.
దవాఖాన సూపరింటెండెంట్ను కలిసి బ్లాక్ ఫంగస్ వార్డు ఏర్పాటు గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్ శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు అధికంగా నమోదవుతున్న దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం ఈఎన్టీ దవాఖానను బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్సలకు నోడల్ కేంద్రంగా ప్రకటించడంతో యుద్ధ ప్రాతిపదికన దవాఖానలో 30 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ వార్డులో ఇప్పటికే 20 మంది బ్లాక్ ఫంగస్ బాధితులు ఇన్ పేషంట్లుగా చికిత్సలు పొందుతున్నారని వెల్లడించారు.
బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్యను బట్టి 100 పడకల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ఈఎన్టీ దవాఖానలో అత్యవసర శస్త్ర చికిత్సలు మినహా అన్ని రకాల వైద్య సేవలను నిలిపివేసి, పూర్తి స్థాయిలో బ్లాక్ ఫంగస్ రోగులకు వైద్య సేవలు అందించేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బ్లాక్ ఫంగస్ కేసుల చికిత్సలకు వైద్యులు, సిబ్బంది కొరత లేదని అవసరమైన వైద్య పరికరాల కోసం టీఎస్ఎంఎస్ఐడీసీకి ఇండెంట్ పంపించినట్లు తెలిపారు.