డెహ్రాడూన్ : రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ ఉత్తరాఖండ్ సీఎం తిరత్ సింగ్ రావత్ ఉన్నతాధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వివాహా వేడుకకు హాజరయ్యేందుకు గతంలో 100 మందికి వరకు అనుమతి ఉండగా ఆ సంఖ్యను 25 మందికి తగ్గించారు.
పెళ్లి వేడుకలు కేవలం 25 మందితోనే జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆయన ఆదేశించారు. శనివారం రాష్ట్రంలో కరోనా పరిస్ధితిపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో ఆయన సమీక్షించారు.
మార్కెట్లను అవసరం అనుకుంటేనే తెరవాలని, సమయాన్ని కుదించాలని ఆదేశించారు. ఆశా వాలంటీర్లందరికీ ప్రత్యేక ప్రోత్సాహకంగా రూ. 1000 ఇవ్వాలని సూచించారు.
కొవిడ్ హెల్ఫ్లైన్లు మరింత చురుగ్గా పని చేయాలని, అందుబాటులో ఉన్న పడకలు, మందుల వివరాలు వెనువెంటనే నమోదు చేయాలని చెప్పారు.
మరిన్ని ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని, అంబులెన్స్ ధరలను నిర్దేశించి ధరలు పెరగకుండా చూడాలన్నారు.
కొవిడ్ మందుల బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 147 ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఎం రావత్ వెల్లడించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.