హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర జనాభా 2019లో సుమారు 3.72 కోట్లు ఉండొచ్చని కేంద్ర జనగణన విభాగం పేర్కొన్నది. ఆ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు నమోదైన జనన, మరణాల ఆధారంగా తాజాగా జనాభా నివేదికను విడుదల చేసింది. 2019 చివరినాటికి దేశ జనాభా దేశ 133.89 కోట్లుగా పేర్కొన్నది. ఆ ఏడాది 2.67 కోట్ల మంది జన్మించారని, 83 లక్షల మంది దాకా మరణించి ఉంటారని అంచనా వేసింది. దేశవ్యాప్తంగా 1.65 లక్షల మంది నవజాత శిశువులు మరణించినట్టు తెలిపింది. మొత్తం మరణాల్లో ఇది 2.2 శాతంగా పేర్కొన్నది. తెలంగాణలో ఆ ఏడాది 8.41 లక్షల మంది జన్మించారని, 2.34 లక్షల మంది మరణించారని పేర్కొన్నది. రాష్ట్రంలో ప్రతి గంటకు 96 మంది పిల్లలు జన్మించారు. అదేసమయంలో సుమారు 27 మంది మరణించారు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ వివరాలను సేకరిస్తున్నట్టు నివేదిక వెల్లడించింది. 2019లో రాష్ట్రంలో జననాల నమోదు 100 శాతం నమోదైంది. దేశవ్యాప్తంగా మొత్తం 14 రాష్ర్టాల్లో నూరు శాతం నమోదయ్యాయి. అదే సమయంలో జాతీయ సగటు 92.7 శాతంగా ఉన్నది. జననాల నమోదు కోసం తెలంగాణ ప్రభుత్వం ‘యూనిఫైడ్ బర్త్స్ అండ్ డెత్స్’ (యూబీడీ) సాఫ్ట్వేర్ను వినియోగిస్తున్నదని నివేదికలో పేర్కొన్నది. సర్టిఫికెట్లన్నీ ఆన్లైన్లో మీ-సేవ కేంద్రాల ద్వారా జారీ చేస్తున్నట్టు వెల్లడించింది. అంతేకాకుండా రాష్ట్రంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సర్టిఫికెట్ జారీ చేస్తున్నారని, ఎవరికీ తిరస్కరించలేదని స్పష్టం చేసింది. 2018లోనూ తెలంగాణలో 100 శాతం జననాలు నమోదయ్యాయి. మరోవైపు 2019లో రాష్ట్రంలో 97.2 శాతం మరణాలు నమోదయ్యాయని నివేదిక వెల్లడించింది.
2019లో తెలంగాణలో నమోదైన జననాలు 8,41,268
బాలురు 4,30,652
బాలికలు 4,10,616
రాష్ట్రంలో మెరుగుపడ్డ లింగనిష్పత్తి
2019
1000 (బాలురు)
953 (బాలికలు)
2017
1000 (బాలురు)
915 (బాలికలు)
(పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో ఆడపిల్లల జననాలు ఎక్కువ సంఖ్యలో నమోదుకావటం విశేషం)