న్యూఢిల్లీ : దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఇప్పటికీ కరోనా వైరస్ ముప్పు పొంచిఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ మంగళవారం హెచ్చరించారు. ప్రజలంతా విధిగా కొవిడ్-19 నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. దేశ జనాభాలో మూడో వంతు మందిలో యాంటీబాడీలు లేవని, దేశ జనాభాలో 40 కోట్ల మంది ఇప్పటికీ వైరస్ బారినపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
నాలుగవ జాతీయ సెరో సర్వే వివరాలను ఆయన వెల్లడించారు. జూన్-జులైలో 70 జిల్లాల్లో ఈ సెరో సర్వే చేపట్టారని ఇందులో ఆరు నుంచి 17 సంవత్సరాల లోపు వారినీ చేర్చారని చెప్పారు. దేశ జనాభా అంతటిలో 67.6 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నట్టు వెల్లడైందని అన్నారు. 6-9 ఏండ్ల వయసు వారిలో 57.2 శాతం మందిలో యాంటీబాడీలు ఉండగా, 10-17 ఏండ్ల వయసులో వారిలో 61 శాతం, 18-44 ఏండ్ల వయసువారిలో 66.7, 45-60 ఏండ్ల వయసు వారిలో 77.6 శాతం మందిలో యాంటీబాడీలను గుర్తించారు.
ఇక ఆరోగ్య కార్యకర్తల్లో 85.2 శాతం మందిలో యాంటీబాడీలను గుర్తించారు. దేశ జనాభాలో ఆరేండ్లు పైబడిన వారందరిలో మూడింట రెండు వంతుల జనాభాలో కరోనాను నిరోధించే యాంటీబాడీలున్నట్టు సెరోసర్వేలో వెల్లడైందని బలరాం భార్గవ పేర్కొన్నారు.