Prashant Bhushan | ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’పై ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలను వాయిదా వేయాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ అంశంపై కుట్రకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. ఈ ఏడాదిలో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాల ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా ఐదు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచే అవకాశం లేదని, అలాగని ఎన్నికలు నిర్వహించి ఓడిపోతే ఈ ప్రభావం వచ్చే ఏడాది జరుగబోయే లోక్సభ ఎన్నికలపై పడడం ఖాయమని భావించి.. ఎలాగైనా ఈ ఐదురాష్ట్రాల ఎన్నికలను వచ్చే ఏడాదికి వాయిదా వేసి.. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందన్నారు.
‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అమలు చేయడం సాధ్యం కాదన్నారు. భారత్ వంటి ప్రజాస్వామ్య దేశంలో మధ్యలో ఓ ప్రభుత్వం మెజారిటీని కోల్పోతే కూలిపోతే.. అలాంటి సమయంలో జమిలి ఎన్నికల నిర్వహణతో ఎలాంటి లాభం ఉండబోదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పేర్కొన్నారు. అలాగే, జమిలి ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చిన సమయంలో రాష్ట్రపతి పాలన విధించాల్సి ఉంటుందని, అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని వ్యాఖ్యానించారు. అదే జరిగితే మనం ప్రజాస్వామ్యం నుంచి అధ్యక్ష తరహా పాలన వైపు మళ్లాల్సి ఉంటుందన్నారు.
ఇందుకోసం కేంద్రం పార్లమెంటులో చట్ట సవరణకు సిద్ధమవుతోందన్న ఆయన.. తన దృష్టిలో ప్రభుత్వానికి దీనిపై పూర్తి అవగాహన ఉందని అభిప్రాయపడ్డారు. రాజ్యసభలో ప్రస్తుత ప్రభుత్వానికి మెజారిటీ లేదని, ఆ విషయం తెలిసే జమిలి ఎన్నికల వ్యూహానికి తెరలేపుతోందని ఆరోపించారు. ఐదు రాష్ట్రాల్లో ఓటమి భయం ప్రభుత్వానికి ఉందని, అందుకే ఎన్నికలు వాయిదా వేసి ఏకంగా సార్వత్రిక ఎన్నికలతో కలిపి ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశం ఉందన్నారు. అప్పటి వరకు ఐదు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధిస్తారని ప్రశాంత్ భూషణ్ వివరించారు.