తిరువనంతపురం: కేరళలో జికా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తున్నది. అక్కడ ఇప్పటికే 18 మంది జికా వైరస్ బారినపడగా తాజాగా మరో కేసు బయటపడింది. దాంతో రాష్ట్రంలో మొత్తం జికా వైరస్ కేసుల సంఖ్య 19కి చేరింది. అనారోగ్యంతో కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధురాలికి జికా వైరస్ సోకినట్లు తేలింది. ఆమె నుంచి శాంపిల్స్ను సేకరించి పరీక్షించగా జికా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జ్ మీడియాకు వెల్లడించారు.