ముంబై, సెప్టెంబర్ 11: ముంబైలో ఘో రం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున సాకీనాకా ప్రాంతంలో 34 ఏండ్ల మహిళపై మానవ మృగం లైంగిక దాడికి పాల్పడింది. నిందితుడు బాధితురాలి మర్మాంగాల్లోకి ఇనుప రాడ్డు చొప్పించి కిరాతకంగా హింసించాడు. కత్తితో పొడిచాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాక పారిపోయాడు. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను తలపించిన ఈ ఘటన మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టించింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అనుమానితుడు మోహన్ చౌహాన్ను (45) పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. కేసు దర్యాప్తునకు సిట్ను నియమించారు. ఘటనను మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా ఖండించారు. ఇది మానవత్వానికి మాయని మచ్చ అన్నారు. కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిందితునికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకొంటామన్నారు.
పోలీస్ కస్టడీకి నిందితుడు
శుక్రవారం ఉదయం 3.30 గంటలకు పోలీసులకు ఫోన్ రావడంతో వెంటనే సాకీనాకా పారిశ్రామిక ప్రాంతానికి వెళ్లారు. అక్కడ రోడ్డు పక్కన టెంపో వ్యాన్లో ఓ మహిళ రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో ఉన్నది. వెంటనే ఆమెను అదే టెంపోలో దవాఖానకు తరలించారు. టెంపో తాళం చెవిని అక్కడ ఉన్న వాచ్మ్యాన్ ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలిని రాజవాడి దవాఖానకు తరలించారు. ఆమె చికిత్స పొందుతూ శనివారం చనిపోయారు. సీసీటీవీ కెమెరాల్లో ఫుటేజీ ఆధారంగా టెంపోను పార్క్ చేసిన మోహన్ చౌహాన్ను అదుపులోకి తీసుకొన్నారు. కోర్టులో హాజరుపరిచారు. అతనికి కోర్టు ఈ నెల 21 వరకు పోలీస్ కస్టడీ విధించింది. యూపీలోని జౌన్పూర్కు చెందిన మోహన్ డ్రైవర్గా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు.
భద్రత లేదు
లైంగిక దాడి ఘటనపై బీజేపీ మహారాష్ట్ర సర్కారుపై విమర్శలు గుప్పించింది. ముంబైలో మహిళలకు భద్రత లేదని ఆరోపించింది. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత ఫడణవీస్ డిమాండ్ చేశారు. ఈ కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది.